పంజాబ్‌లో ఎన్నారై కుటుంబం అరెస్ట్..!

మ్యారేజీహాల్ యజమాని, అతడి కుమారుడిపై దాడి చేశారనే ఆరోపణలతో ఓ ప్రవాస భారతీయ కుటుంబానికి చెందిన 9మందిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారంతా బ్రిటన్‌లోని సౌత్‌హాల్, లీచెష్టర్ ప్రాంతాలకు.. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతాలకు చెందినవారు కావడం గమనార్హం. కాగా.. ఈ సంఘటనతో సంబంధమున్న మరికొందరిని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గత శనివారం రోజున గురుప్రీత్ సింగ్ వివాహ వేడుక జరిగింది. వరుడి కుటుంబ సభ్యులకు చెందిన ఓ విలువైన బ్యాగ్ పోవడంతో, వారు మ్యారేజ్ హాల్ యజమాని, అతడి కుమారుడిపై దాడికి పాల్పడ్డారు. దీంతో తమపై 20 మంది దాడి చేశారని.. మ్యారేజీ హాల్ యజమాని హోషియార్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మ్యారేజీ హాల్ యజమాని ఫిర్యాదును అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. పెళ్లికుమారుడితో సహా అతడి తల్లి సుఖ్విందర్ కౌర్, అతడి ఇద్దరి సోదరీమణులు, మరో ఐదుగురిని అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వీరందరినీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇక పెళ్లి కుమారుడి తండ్రి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి