పటిష్ట భద్రతను కల్పిస్తాం : కెవిన్ రూడ్

ఆస్ట్రేలియాలోని విదేశీ విద్యార్థుల భద్రతకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామనీ ఆ దేశ ప్రధానమంత్రి కెవిన్ రూడ్ పునరుద్ఘాటించారు. విదేశీ విద్యార్థుల్లో ఒకరిపై దాడి జరిగినా అది అనేకమందిపై జరిగినట్లేనని, అందుకునే వీరికి గరిష్ట భద్రతను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

తాజాగా మరో ఇద్దరు భారతీయులపై దాడి జరిగిన నేపథ్యంలో కెవిన్ రూడ్ కాన్‌బెర్రాలో భారతీయ మీడియాతో మాట్లాడుతూ... బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా లాంటి దేశాలతో పోల్చితే తమ దేశంలో నేరాల శాతం తక్కువేనని అన్నారు. విదేశీ విద్యార్థుల భద్రతకు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటున్నామని, అవసరమైతే ఎక్కువ భద్రతను కల్పిస్తామని ఆయన తెలిపారు.

విదేశాల్లో తమ దేశీయులపై కూడా దాడులు జరుగుతున్న నేపథ్యాన్ని ప్రస్తావించిన రూడ్... గత దశాబ్దంలో ఒక్క భారత్‌లోనే 20 సంఘటనలు జరిగాయని ఎత్తిచూపారు. కొంతమందిని కొట్టారనీ, మరికొందరిపై హత్యలు, అత్యాచారాలు జరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులకు మొత్తం భారతీయులను, అక్కడి ప్రభుత్వాన్ని తప్పుపట్టేమని రూడ్ అన్నారు.

ఏది ఏమయినప్పటికీ... తమ దేశంలో ఉండే విదేశీ విద్యార్థుల భద్రతకు ఈ దేశ ప్రధానిగా బాధ్యత తనదేనని కెవిన్ రూడ్ స్పష్టం చేశారు. సంస్కృతి, ఆహారం, సంగీతం, క్రికెట్ లాంటి అనేక విషయాలలో భారత్, ఆస్ట్రేలియాల నడుమ గట్టి సంబంధ బాంధవ్యాలున్నాయని, హిందీ సినిమాలంతే తాను చెవి కోసుకుంటానని ఆయన వెల్లడించారు. అయితే ఏ సంబంధంలోనయినా సమస్యలుంటాయనీ, వాటిని తీవ్రతరం చేసుకోకుండా ఉంటే సరిపోతుందని రూడ్ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి