ప్రవాసుల ఆస్తిహక్కు చట్టంలో సవరణలు

FILE
ప్రవాస భారతీయుల ప్రయోజనాలను కాపాడేలా ఆస్తి హక్కు చట్టాన్ని సవరించేందుకు భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (జీఓపీఐఓ) భావిస్తోంది. ఆగస్టు 21, 22 తేదీలలో రెండు రోజులపాటు జరుగనున్న 20వ వార్షిక సమావేశాలలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని జీఓపీఐఓ యోచిస్తోంది.

కాగా... అతి పురాతన, పెద్దదైన ప్రవాస భారత సంస్థగా గుర్తింపు పొందిన జీఓపీఐఓ వార్షిక సమావేశాలు లాగార్డియా విమానాశ్రయం సమీపంలోని క్రౌన్ ప్లాజా హోటల్‌లో జరుగనున్నాయి. భారత ప్రవాస వ్యవహారాల శాఖా మంత్రి వాయలార్ రవి ఈ సమావేశాలను ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా జీఓపీఐఓ అధ్యక్ష పదవి నుంచి వైదొలగబోయే ఇందర్ సింగ్ మాట్లాడుతూ... "భారత సంతతి ప్రజలు : ప్రపంచంతో బలమైన సంబంధాలు" అనే అంశంపై ఈ సంవత్సరం సమావేశాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నారైల ఆస్తి యాజమాన్య హక్కు చట్టంలో సవరణలు తెచ్చేలా భారత ప్రభుత్వంపై తాజా ఒత్తిడి తేవాలనే ప్రయత్నం కూడా ఇందులో భాగమేనని ఆయన వివరించారు.

ఇదిలా ఉంటే... భారత్‌లో అమెరికా రాయబారిగా పనిచేసిన ఫ్రాంక్ విస్నర్, ట్రినిడాడ్ అండ్ టొబాగో మాజీ ప్రధానమంత్రి బాస్‌డియో పాండే, దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగర మేయర్ లోజీ నాయుడు, బ్రిటన్‌కు చెందిన లార్డ్ దల్జిత్ రాణా... తదితరులు ఈ సమావేశాలకు హాజరయ్యే ప్రముఖుల జాబితాలో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి