ప్రవాస భారతీయుడికి "యూకే సిటిజన్" అవార్డు

FILE
సామాజిక సేవ, సంక్షేమ కార్యక్రమాల్లో గణనీయమైన కృషి సల్పిన ప్రవాస భారతీయుడు అజ్మర్ సింగ్ బ్రాసాను యూకే ప్రభుత్వం సిటిజన్ అవార్డుతో సత్కరించింది. లీసెస్టర్ సిక్కు కమ్యూనిటీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తున్న బ్రాసా, సామాజిక సేవా కార్యక్రమాల్లో చేసిన కృషి అందరికీ ఆదర్శనీయమని ఈమేరకు యూకే వ్యాఖ్యానించింది.

లీసెస్టర్‌లోని సిక్కు ఆలయానికి అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న బ్రాసా.. గత కొన్ని సంవత్సరాలుగా ఆలయం ఆధ్వర్యంలో జరిగే అనేక క్రీడలకు ఆర్గనైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ఆలయ అధికార ప్రతినిధిగా కూడా పనిచేస్తున్న ఆయన పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.

లీసెస్టర్ వైశాఖీ ఫెస్టివల్ కమిటీ లీడింగ్ సభ్యుడిగా కూడా పనిచేస్తున్న బ్రాసా.. స్థానికంగా నిధులను సమకూర్చేందుకు అవసరమైన అనేక కార్యక్రమాలను నిర్వహించారు. అదే విధంగా పంజాబులో అనేక ఉచిత ఆర్గనైజింగ్ శిబిరాలను సైతం ముందుండి నడిపించారు.

ఈ నేపథ్యంలో అనేక సామాజిక, సంక్షేమ కార్యక్రమాలలో క్రియాశీలకంగా పనిచేస్తున్న బ్రాసాను యూకే ప్రభుత్వం సిటిజన్ అవార్డుతో సత్కరించేందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు సోమవారం రోజున లీసెస్టర్ లార్డ్ మేయర్ కౌన్సిలర్ రోజర్ బ్లాక్‌మోర్ ఆధ్వర్యంలో జరిగిన టీ పార్టీ సందర్భంగా బ్రాసాకు అవార్డును ప్రదానం చేశారు.

వెబ్దునియా పై చదవండి