బహిరంగ దహనక్రియల పోరాటంలో ఎన్నారై విజయం..!

FILE
హిందూ మత సంప్రదాయాల ప్రకారం దహనక్రియలను నిర్వహించుకునేందుకు అనుమతినివ్వాలంటూ బ్రిటన్‌లో న్యాయపోరాటం చేస్తున్న భారత సంతతి సామాజిక, ఆధ్యాత్మిక నేత దేవిందర్ ఘాయ్ విజయం సాధించాడు.

తాను చనిపోయిన తరువాత హిందూ మతాచారం ప్రకారం బహిరంగంగా అంత్యక్రియలను నిర్వహించేందుకు అనుమతివ్వాలంటూ 71 సంవత్సరాల ఘాయ్ కోర్టుకెక్కారు. దీనికి స్పందించిన బ్రిటన్ న్యాయస్థానం ఘాయ్ కోరికను మన్నిస్తూ అనుమతి మంజూరు చేస్తూ చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఘాయ్ కోర్టు తీర్పు తనకో కొత్త ఉత్సాహాన్నిచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు.

చట్టంలో స్పష్టత కోరుకున్నానే తప్ప, చట్టాన్ని ఉల్లంఘించాలని కానీ, అగౌరవపరచాలని కానీ తన ఉద్దేశ్యంకాదని ఘాయ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. 1902 దహన సంస్కారాల చట్టం ప్రకారం బ్రిటన్‌లో బహిరంగ అంత్యక్రియలు నిషేధం. ఈ కారణంతోనే భారత సంతతికి చెందినవారు ఎవరైనా అక్కడ మరణించినట్లయితే స్వదేశానికి తరలించి దహనక్రియలను నిర్వర్తిస్తున్నారు. న్యాయస్థానం తాజా తీర్పుతో ఇప్పుడు అక్కడ ప్రవాసులకు ఈ ఇబ్బంది తప్పినట్లైంది.

వెబ్దునియా పై చదవండి