బాపూజీపై పుస్తకం రాస్తా...! : గోర్డాన్ బ్రౌన్

FILE
ప్రపంచ నాగరికతకు జాతిపిత మహాత్మాగాంధీ అందించిన శాంతి సందేశం గురించి తాను ఓ పుస్తకం రాయాలని భావిస్తున్నట్లు బ్రిటన్ ప్రధానమంత్రి గోర్డాన్ బ్రౌన్ వెల్లడించారు. ఇరవయ్యో శతాబ్దంలోని గొప్ప నాయకుల్లో ఒకరైన మహాత్ముడు ఎప్పుడూ అధికారం కోసం ప్రాకులాడలేదని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.

గుజరాతీ, ఇంగ్లీషు భాషల్లో వెలువడే "గారవి గుజరాత్" అనే మ్యాగజైన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బ్రౌన్ మాట్లాడుతూ... మన నాగరిక సమాజానికి గాంధీజీ అందించిన శాంతి సందేశంపై మరో కోణంలో పుస్తకం రాయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. గొప్ప నేతల్లో ఒకరైన బాపూజీ ప్రజల హృదయాలను, ఆలోచనలను మార్చటంద్వారా వారికి దగ్గరయ్యారని బ్రౌన్ వ్యాఖ్యానించారు.

ప్రపంచంలోని ఎంతోమందితో పాటు తనకు కూడా మహాత్మాగాంధీ స్ఫూర్తిగా నిలిచారని బ్రౌన్ తెలిపారు. మహాత్ముడు ఆచరించిన అహింస, సహాయ నిరాకరణ, విలువల గురించి తాను చాలా పుస్తకాల్లో చదివినట్లు ఆయన పేర్కొన్నారు. తాను కూడా బాపూజీ స్వయంగా ఆచరించి, ఆదర్శంగా నిలిచిన విలువల గురించి పుస్తకం రాస్తాననీ.. ఇందుకోసం తాను త్వరలోనే భారత్ పర్యటించే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి