బ్రౌన్ సమాధి పునర్మిర్మాణానికై "తాల్" కృషి

తెలుగుభాష పునరుత్తేజానికి విశేషమైన సేవలందించిన సీపీ బ్రౌన్ సమాధి పునర్నిర్మాణానికై లండన్ తెలుగు సంఘం (తాల్) నడుం బిగించింది. ఈ మేరకు బ్రౌన్ జ్ఞాపకాలను పదిలపర్చుకునేందుకుగానూ కెన్సల్ గ్రీన్‌లో ఉన్న ఆయన సమాధిని తిరిగి నిర్మించేందుకు చర్యలు చేపట్టింది.

లండన్‌లో నివసిస్తున్న ప్రముఖ తెలుగు సాహితీ వేత్త డాక్టర్ గూటాల కృష్ణమూర్తి... బ్రౌన్ సమాధిని పునర్నిర్మించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హిందీ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రూపకల్పన చేయగా... ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ. గోపాలకృష్ణ, డాక్టర్ రాధ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గూటాల కృష్ణమూర్తి మాట్లాడుతూ... తాళపత్ర గ్రంథాలలో నిక్షిప్తమయిన ప్రాచీన తెలుగు భాషను ప్రచురణ రూపంలోకి తేవడంతోపాటు, తెలుగు-ఆంగ్లం నిఘంటువు రూపొందించిన ఘనత బ్రౌన్‌కి దక్కిందన్నారు. తెలుగు భాషకు విశేషమైన కృషి చేసిన ఆయన జ్ఞాపకాలను పదిలపర్చుకోవడం మనందరి కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.

బ్రౌన్ సమాధిని పునర్నిర్మించేందుకు ముందుకొచ్చిన లండన్ తెలుగు సంఘాన్ని ఈ సందర్భంగా లక్ష్మీప్రసాద్ అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తాల్ అధ్యక్షు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, ట్రస్టీలతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు, స్థానికంగా నివసించే తెలుగువారు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి