ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఐదు రోజుల క్రితం హత్యకు గురైన మూడు సంవత్సరాల బాలుడు గురుషాన్ సింగ్ చన్నా హత్య కేసులో గురుసేవక్ థిల్లాన్ అనే 23 సంవత్సరాల భారతీయ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం మెల్బోర్న్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో నిందితుడిని పోలీసులు హాజరు పరిచారు.
కాగా.. గురుసేవక్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయమూర్తి ప్రకటించినప్పటికీ, అతడు బెయిల్ ప్రయత్నాలేమీ చేయటంలేదని అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. తనపై ఆరోపణలు వచ్చినప్పటికీ కోర్టులో గురుసేవక్ చాలా మౌనంగా కూర్చున్నాడేగానీ, మరేమీ మాట్లాడలేదు. ఒక నిమిషంకంటే తక్కువ సమయం సాగిన ఈ కేసు విచారణ, అదనపు సాక్ష్యాధారాల సేకరణ నిమిత్తం జూన్ 29వ తేదీనాటికి వాయిదా పడింది.
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాలోని పర్యాటక కేంద్రాలను తిలకించేందుకు తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లిన గురుషాన్ ఐదురోజుల క్రితం హత్యకు గురైన సంగతి తెలిసిందే. మెల్బోర్న్ ఎయిర్పోర్టుకు సమీపంలోని అక్లాండ్ జంక్షన్, వైల్డ్వుడ్ రోడ్డులో ఈ బాలుడి శవం పడివుండటాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. కాగా, బాలుడు కనిపించకుండా పోయిన 45 నిమిషాల్లో అతని తల్లి హరప్రీత్ కౌర్ చన్నా పోలీసులుకు ఫిర్యాదు చేశారు. తప్పిపోయిన బాలుడు మృతి చెందినట్టు అతని ధరించిన చొక్కా, జీన్స్ ఆధారంగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.