భారత కవి అరవింద్ మెహ్రోత్రా పరాజయం

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కావ్య విభాగం ప్రొఫెసర్ ఎన్నికలలో భారత ప్రముఖ కవి అరవింద్ మెహ్రోత్రా పరాజయం పాలయ్యారు. "ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కవితా విభాగం ప్రొఫెసర్" ఎంపిక కోసం జరిగిన ఎన్నికల్లో ఛార్లెస్ డార్విన్ వంశానికి చెందిన రూథ్ పాడెల్ చేతిలో ఈయన ఓటమిని చవిచూశారు.

కాగా... నోబుల్ ఫ్రైజ్ విజేత డెరెక్ వాల్కాట్ పోటీల నుంచి వైదొలగడంతో మెహ్రోత్రా పాడెల్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సన్నద్ధమయిన సంగతి తెలిసిందే. అయితే మెహ్రోత్రా-రూథ్ పాడెల్‌ల మధ్యా జరిగిన ఎన్నికల్లో 129 మంది మెహ్రోత్రాకు అనుకూలంగా ఓటు వేయగా... రూధ్ పాడెల్ అభ్యర్థిత్వాన్ని 297 మంది సమర్థించి, గెలిపించారు. ఈ ఎన్నికలలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

బ్రిటన్ కవిత్వానికి సంబంధించి అత్యంత ప్రసిద్ధమైన హోదాగా భావించబడే ఈ ప్రొఫెసర్ పదవీ బాధ్యతలను.. క్రిష్టఫర్ రిక్స్ అనంతరం, రూథ్ పాడెల్ స్వీకరించనున్నారు. అంతేగాకుండా, ఈ పదవిని అలంకరించిన తొలి మహిళగా పాడెల్ రికార్డును సృష్టించారు. ఇదిలా ఉంటే... ఈ పదవిని 1708లో తొలిసారిగా ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే... ఈ పోటీలలో గెలిచినవారు ఐదేళ్లపాటు ఈ హోదాలో కొనసాగుతారు. వీరు ప్రతి సంవత్సరం గౌరవ వేతనంగా 6,901 పౌండ్లు (దాదాపు 5.6 లక్షల రూపాయలు) పొందుతారు. అలాగే.. వీరు కవిత్వంపై సంవత్సరానికి మూడు ఉపన్యాసాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాక యూనివర్సిటీ వేడుకల్లో ఆడంబరమైన భూమికను పోషించాల్సి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి