భారత వర్సిటీలపై అమెరికన్ విద్యార్థుల మక్కువ...!

FILE
ఇప్పటిదాకా అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉంటున్న విషయం తెలిసిందే..! అయితే అమెరికన్ విద్యార్థులు ఉన్నత విద్య కోసం భారత్‌వైపు మొగ్గు చూపుతున్నట్లు.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) విడుదల చేసిన "ఓపెన్ డోర్స్-2009" నివేదికలో వెల్లడించింది.

ఉన్నత విద్య కోసం అమెరికన్ విద్యార్థులు కొంత కాలం క్రిందటిదాకా.. సాటి అగ్ర దేశాలనే ఎంపిక చేసుకునేవారనీ.. అయితే వారు ఇప్పుడిప్పుడే భారత విశ్వవిద్యాలయాల వైపు దృష్టి సారిస్తున్నారని ఐఐఈ నివేదిక తెలిపింది. గత విద్యా సంవత్సరంలో 3,150 మంది అమెరికన్ విద్యార్థులు భారత్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో చేరారు.

కాగా.. అంతకు మునుపు ఏడాది కంటే గత ఏడాది భారత్ చేరుకున్న అమెరికన్ విద్యార్థుల సంఖ్యలో 20 శాతం పెరుగుదల నమోదైనట్లు ఐఐఈ పేర్కొంది. దీంతో.. అమెరికన్ విద్యార్థులు ఎంపిక చేసుకునే విదేశాల్లో భారత్ ప్రస్తుతం 17వ స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే... అమెరికన్ విద్యార్థులు అత్యధికంగా 33,333 మంది బ్రిటన్‌లో చదువుకుంటుండగా.. ఆ తరువాత స్థానాల్లో ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, చైనాలు ఆక్రమించాయి.

వెబ్దునియా పై చదవండి