భారత విద్యార్థులకు మైక్‌ రాన్ లేఖ

FILE
తమ దేశంలో విదేశీయులపై జరుగుతున్న వరుస దాడులతో భీతిల్లిన విద్యార్థులకు ధైర్యం కల్పించేందుకుగానూ ఆస్ట్రేలియా ప్రభుత్వం అసాధారణ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా.. దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వ అధినేత మైక్‌ రాన్, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు 4787 మంది భారత విద్యార్థులకు స్వయంగా లేఖలు రాశారు.

భద్రతపై ఆందోళన చెందవద్దని, తగినంత భద్రత కల్పిస్తామని మైక్ రాన్ భారత విద్యార్థులకు రాసిన లేఖల్లో పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతే తమకు ముఖ్యమని, విద్యార్థులకు సహాయం చేసేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారనీ, ఎవరిపైనా ఎలాంటి వివక్షా ఉండబోదని తాను హామీనిస్తున్నట్లుగా మైక్ రాన్ ఆ లేఖల్లో వివరించారు.

ఇదిలా ఉంటే... మైక్ రాన్ చేసిన పనిని భారతీయ విద్యార్థులు స్వాగతించారు. స్వయంగా ఆయనే లేఖ రాయటం తమకు ఆశ్చర్యాన్ని కల్గించిందనీ, దాడులను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించటం మంచి పరిణామమని.. విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా... ఉపాధి, శిక్షణ, విద్యాభ్యాసం తదితర అంశాలపై విద్యార్థులకు సలహా ఇచ్చేందుకు దక్షిణ ఆస్ట్రేలియా ఓ కార్యాలయాన్ని నెలకొల్పింది. అలాగే విదేశీ విద్యార్థులకు రాయితీపై ప్రయాణించే సౌకర్యాన్ని సైతం ఆ దేశం కల్పిస్తోంది. ఈ రకంగా జాతి వివక్ష దాడుల నేపథ్యంలో ఏర్పడిన కళంకాన్ని ఆసీస్ ప్రభుత్వం తుడుచుకునేందుకు పలు రకాల చర్యలు చేపట్టడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి