భార్యను హత్య చేసిన ఎన్నారై అరెస్టు

భారత సంతతికి చెందిన బ్రిటన్ మహిళ మంజిత్ కౌర్ కులార్, రెండు సంవత్సరాల క్రితం పంజాబ్‌లో మరణించారు. అయితే రోడ్డు ప్రమాదంలో మరణించిందని చెప్పబడ్డ ఆమె హత్యకు గురయ్యిందనీ, ఆ హత్య చేసింది ఆమె భర్త జగ్‌పాల్ సింగ్ కులార్ అని స్కాట్లాండ్ పోలీసులు కనుగొన్నారు. బ్రిటన్‌కు చట్ట విరుద్ధంగా వెళ్లిన జగ్‌పాల్ కేవలం బ్రిటన్ పౌరసత్వం కోసమే అమాయకురాలైన మంజీత్‌ను పెళ్లి చేసుకుని, ఆపై ఏమీ ఎరగనట్లు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

వివరాల్లోకి వస్తే... 2007 అక్టోబర్ నెలలో భర్త జగ్‌పాల్‌జీత్ సింగ్‌తో కలిసి బంధువులతో దీపావళి సంబరాలను జరుపుకునేందుకు భారత్ వచ్చింది మంజీత్ కౌర్. అయితే పండుగరోజు రాత్రే ఆమె దుర్మరణం పాలయ్యింది. కేసు దర్యాప్తు చేసిన పంజాబ్ పోలీసులు మంజీత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లుగా నిర్ధారించి కేసు మూసివేశారు.

అదలా ఉంటే... రెండేళ్ల తరువాత మంజీత్ కౌర్ కేసును తిరగదోడిన స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు, ఆమెది ప్రమాద మరణం కాదనీ, హత్యకు గురయ్యిందని కనుగొన్నారు. ఆమె హత్యకు కుట్రపన్నింది ఆమె భర్త జగ్‌పాల్‌జీత్ సింగ్ అని గుర్తించిన పోలీసులు అతడిని కటకటాల వెనక్కి నెట్టారు.

రోడ్డు ప్రమాదం అని పేర్కొన్న ఘటనలో మొహం ఏ మాత్రం గుర్తు పట్టేందుకు వీలులేకుండా చితికిపోయిన దారుణంగా మరణించిన కౌర్‌కు ఎట్టకేలకు న్యాయం జరిగింది. తన అతి తెలివితనంతో పంజాబ్ పోలీసులను తప్పుదారి పట్టించి కులాసాగా తిరిగిన సింగ్ చివరకు చట్టానికి చిక్కక తప్పలేదు.

వెబ్దునియా పై చదవండి