మలేషియాలో అగ్ని ప్రమాదం: 4గురు భారతీయుల మృతి

FILE
మలేషియాలో బుధవారం జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో నలుగురు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. మలేషియాలోని దక్షిణ జోహోర్ రాష్ట్రంలోని ఒక చీరల దుకాణంలో ఈరోజు ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న నలుగురు భారతీయులు మరణించారు.

ఫైర్ రెస్క్యూ డిపార్ట్‌మెంట్‌కు చెందిన షుకోర్ సాని హసీమ్ ఈ ఘటనపై మాట్లాడుతూ... ఉదయాన్నే జరిగిన ఈ ప్రమాదంలో దుకాణంలో పేలుడుకు బద్ధలైందనీ, అందులో పనిచేస్తున్న 4 గురు భారతీయులు మరణించారని స్థానిక పత్రికలకు వెల్లడించారు. పేలుడు తీవ్రతకు దాని పక్కనేగల మరో మూడు దుకాణాలు సైతం అగ్నికి ఆహుతయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. కాగా.. ప్రమాదానికి గురైన చీరల దుకాణం జోహోర్‌లోని జలాన్ పాసర్‌లో గల మాసాయ్‌వద్ద ఉందన్నారు.

కాగా.. ఈ ప్రమాదంలో మరణించిన భారతీయుల గురించి అక్కడి ప్రభుత్వ అధికారులు మాత్రం నోరు విప్పటంలేదు. అదే విధంగా ఈ ప్రమాదానికి సంబంధించిన మరే ఇతర విషయాలు సైతం వెల్లడి కావటం లేదు. ఇదిలా ఉంటే.. మంచి నైపుణ్యం కలిగిన భారతీయులు, చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునే వేలాదిమంది అక్కడి దుకాణాలలో పనిచేస్తున్నన్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి