మస్కట్ అరెస్టులు : పక్కా సమాచారం మేరకే దాడి..!

FILE
పొట్టకూటి కోసం వలస వెళ్లిన వెయ్యిమందికి పైగా తెలుగువారు మస్కట్ నగరంలో అరెస్టయిన సంగతి తెలిసిందే. వీసా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో వీరందరినీ అరెస్టు చేశారు. అయితే సంచలనం సృష్టిస్తున్న ఈ అరెస్టులు గత కొంతకాలంగా సేకరించిన పక్కా సమాచారం మేరకే జరిగినట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ అరెస్టుల గురించి మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయానికి రాయల్ ఒమన్ పోలీసులు ఎలాంటి సమాచారం అందించక పోవటం పై అనుమానాలకు మరింతగా ఊతం ఇస్తోంది. అలాగే.. ఈ ఘటనపై వ్యాఖ్యానించేందుకు భారత దౌత్యవేత్తలు సైతం నిరాకరిస్తున్నారు. ఇక అక్కడి పోలీసులైతే ఎలాంటి వివరాలు చెప్పేందుకు సిద్ధంగా లేరు.

ఇదిలా ఉంటే.. అరెస్టు చేసిన వారిని మస్కట్ నగరంలోని సుల్తాన్ మసీదు సమీపంలోగల కార్మిక మంత్రిత్వశాఖ కార్యాలయానికి తరలించినట్లుగా తెలుస్తోంది. అక్కడ స్థలం సరిపోని కారణంగా అనేకమందిని ఆరుబయటే ఉంచి పోలీసులు కాపలా కాస్తున్నారనీ.. మరికొంతమందిని అల్ సుమేరియాలోని కేంద్ర జైలుకు, రూవీలోని మరో జైలుకు తరలించినట్లు సమాచారం.

కాగా.. అరెస్టయినవారిలో అనేకమంది మహిళలున్నట్లు తెలుస్తోంది. అయితే సరైన వీసా పత్రాలు, యజమానులకు సంబంధించిన వివరాలు ఉన్న వారిని మాత్రం వదిలిపెడుతున్నారనీ.. అనుమానాస్పదంగా ఉన్న వారిని, యజమానుల నుంచి పారిపోయినట్లు అనుమానిస్తున్న కొంతమందిని నిర్బంధించినట్లు తెలుస్తోంది. అరెస్టయినవారిలో ఎక్కువమంది ఉభయ గోదావరి, తెలంగాణా జిల్లాలకు చెందినవారే కావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి