మెల్‌బోర్న్‌లో సామరస్య ర్యాలీ

బహుళ సంస్కృతులకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించేందుకు.. విదేశీ విద్యార్థులకు ఆస్ట్రేలియా సురక్షిత ప్రాంతమేనని సందేశం ఇచ్చేందుకుగానూ.. విక్టోరియా ప్రభుత్వం ఆదివారం మెల్‌బోర్న్‌‌లో ఓ సామరస్య ర్యాలీని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వందలాదిమంది భారతీయులతో పాటు వేలాదిమంది పాల్గొన్నారు.

మెల్‌బోర్న్, సిడ్నీ ప్రాంతాలలో భారతీయ విద్యార్థులపై జరిగిన జాత్యహంకార దాడుల నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన వ్యక్తం కావడంతో విక్టోరియా ప్రభుత్వం ఈ ర్యాలీని నిర్వహించింది. భిన్న సంస్కృతులకు మద్ధతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉంటే... ఈ ర్యాలీలో తాము మాట్లాడేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో, ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ఆ దేశంలోని భారత విద్యార్థుల సంఘం (ఫిసా) ప్రకటించింది. అయితే, ముందుగా దూరంగా ఉండాలనుకున్న ఫిసా తన నిర్ణయం మార్చుకుని, భారతీయ విద్యార్థులు కేవలం పరిశీలకులుగా పాల్గొనాలని సూచించింది.

కాగా... భారతీయ విద్యార్థులపై జరిగిన జాత్యహంకార దాడులకు సంబంధించిన చర్చల్లో తమను పక్కకు పెట్టేందుకు ఆసీస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఫిసా ప్రతినిధి గౌతమ్‌గుప్తా ఈ సందర్భంగా ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి