లండన్‌లో భారతీయుడి అనుమానాస్పద మృతి

లండన్‌లోని ఓ హోటల్‌లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సురి అనే ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాజి వసీం అక్తర్ (25) అనుమానాస్పద రీతిలో మరణించారు. హైదరాబాదులోని "వెరిజొన్ డాటా సర్వీసెస్" అనే బహుళజాతి సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న అక్తర్‌ను.. ప్రత్యేక శిక్షణ నిమిత్తం ఆ సంస్థ లండన్‌కు పంపించింది.

జూలై 6వ తేదీన లండన్ చేరుకున్న అక్తర్.. సెప్టెంబర్ 6వ తేదీన స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్తర్ తండ్రి మొక్తిబ్ మాట్లాడుతూ... లండన్ వెళ్లినప్పటినుంచి ప్రతిరోజూ రెండుసార్లు తల్లితో ఫోన్‌లో మాట్లాడుతుండే అక్తర్, శనివారం తరువాత నుంచి మళ్లీ అందుబాటులోకి రాలేదని చెప్పారు.

ఎన్నిసార్లు తమ కుమారుడి మొబైల్‌కు ఫోన్ చేసినా అటువైపు నుంచి స్పందన లేకపోవటంతో, హైదరాబాదులో అతడు పనిచేసిన సంస్థకు ఫోన్ చేసి వివరాలను అడిగినట్లు మొక్తిబ్ వివరించారు. ఆ తర్వాతి రోజున లండన్ పోలీసుల నుంచి ఫోన్ వచ్చిందని, తమ కుమారుడు మరణించాడని వారు చెప్పారని ఆయన భోరున విలపించారు.

ఇదిలా ఉంటే... అక్తర్ మరణానికి కారణాలు తెలియరాలేదని, తగిన కారణాలను రెండు, మూడు రోజుల్లో కనుగొంటామని కేసు దర్యాప్తు చేస్తున్న లండన్ పోలీసులు చెబుతున్నారు. ఆ తరువాత అతడి మృతదేహాన్ని స్వదేశానికి పంపిస్తామని వారు చెప్పారు. కాగా.. కుమారుడు తిరిగొచ్చాక విహారయాత్రకు వెళ్లాలని ఎదురుచూశామనీ.. ఇప్పుడు తన మృతదేహం కోసం ఎదురుచూడాల్సి వస్తోందని.. అక్తర్ కుటుంబ సభ్యులందరూ రోదిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి