లండన్లో ప్రముఖ ప్రవాస భారతీయ లేబర్ ఎంపీ వీరేంద్ర శర్మ ప్రతిష్టాత్మక "వీకే కృష్ణ మీనన్ అవార్డు"కు ఎంపికయ్యారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికపరంగా ముందంజ వేసేందుకు బ్రిటీష్ కమ్యూనిటీలో ప్రభావవంతమైన పాత్ర పోషించిన వీరేంద్ర శర్మకు 2010 సంవత్సరానికిగానూ పై అవార్డు లభించింది.
లండన్కు చెందిన వీకే కృష్ణ మీనన్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సిరియక్ మఫ్రాయిల్ వీకే శర్మకు "2010 కృష్ణ మీనన్ అవార్డు"కు ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సిరియక్ మాట్లాడుతూ.. దేశంలో లేబర్ పార్టీ కార్యకర్తగా సమాజానికి ఎంతగానో సేవ చేశారనీ, ముఖ్యంగా ఆసియన్ కమ్యూనిటీ నుంచి వచ్చినవారిలో శర్మ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
బ్రిటీష్ రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న శర్మ వీకే కృష్ణ మీనన్ అవార్డుకు ఎంపిక చేయటం ఓ మంచి నిర్ణయమనీ.. ఎందుకంటే మీనన్ అంతటి ఆలోచనా భావాలను శర్మ కలిగి ఉన్నారని మప్రాయిల్ వివరించారు. భారత్ను అమితంగా ఇష్టపడే శర్మ, యువతను లిబరేషన్ పోరాటంలోకి తీసుకొచ్చిన ఘనత, బ్రిటన్లో జాత్యహంకారానికి వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేసిన ఘనతను సొంతం చేసుకున్నారని మప్రాయిల్ ప్రశంసల వర్షం కురిపించారు.