వచ్చే నెలలో కెవిన్ రూడ్ భారత్ పర్యటన

ఆస్ట్రేలియా ప్రధానమంత్రి కెవిన్ రూడ్ వచ్చే నవంబర్ నెలలో భారతదేశంలో పర్యటించనున్నట్లు.. ఆ దేశ వాణిజ్య శాఖా మంత్రి సిమన్ క్రీన్ వెల్లడించారు. ఇటీవలే భారత్ పర్యటించి తిరిగి ఆసీస్ వెళ్లిన సిమన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత విద్యార్థులపై దాడుల అంశం ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీయకూడదని ఇరుదేశాలు భావిస్తున్నాయని పేర్కొన్నారు.

భారత విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల నివారణకు తమ ప్రభుత్వం అన్ని రకాల రక్షణ చర్యలను చేపట్టిందని, విదేశీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటమే తమ లక్ష్యమని ఆయన సిమన్ వివరించారు. అయితే, తమ దేశంలో శాశ్వత నివాసం కోసం కొంతమంది భారతీయ విద్యార్థులు అడ్డదారులు తొక్కుతున్నారని ఆయన ఆరోపించారు.

తాము విద్యను అమ్ముకుంటున్నామేగానీ, వీసాలను కాదని.. ఇకనైనా అక్రమ వీసాల విషయంలో అడ్డదారులు తొక్కవద్దని సిమన్ స్పష్టం చేశారు. కాగా.. ఆస్ట్రేలియాలో గత మే, జూన్ నెలల్లో 22 మంది భారతీయ విద్యార్థులు జాత్యహంకార దాడులకు గురయిన సంగతి తెలిసిందే...!

వెబ్దునియా పై చదవండి