వరద బాధితులకు స్పందన "రిలీఫ్ కిట్స్"

FILE
వరద బాధితులను ఆదుకునేందుకు ప్రవాసాంధ్రుల స్వచ్ఛంద సేవా సంస్థ "స్పందన ఫౌండేషన్" ముందుకొచ్చింది. విజయవాడలోని తమ కార్యకర్తల ద్వారా కృష్ణా జిల్లాలోని మూలపాడు గ్రామంలో వరద బాధితులకు "స్పందన" తన ఆపన్నహస్తాన్ని చాచింది.

స్పందన విజయవాడ విభాగం కార్యదర్శి వాసు ఆధ్వర్యంలో పదిహేను మందికి పైగా కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సుమారు వంద కుటుంబాలకు పైగా "రిలీఫ్ కిట్"లను అందించారు. ఈ సందర్భంగా స్పందన కార్యదర్శి జగదీష్ గుత్తా మాట్లాడుతూ.. బాధితుల తక్షణావసరాలను తీర్చేందుకు తాము చేసిన సహాయం ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

అలాగే స్పందన కోశాధికారి మురళి చౌదరి సుంకర మాట్లాడుతూ.. వరద బాధితుల సహాయ నిధికి విరాళాలను సేకరించేందుకు అమెరికా నలుమూలలా ఉండే స్పందన సభ్యులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇలా వచ్చిన నిధుల్లో 20 శాతం తక్షణ సహాయ చర్యలకు, మిగిలిన మొత్తాన్ని శాశ్వత సాయానికిగానూ వినియోగించనున్నామన్నారు.

ఉత్తర అమెరికా విభాగం ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్ లంకెల మాట్లాడుతూ.. విరాళాల సేకరణకు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసిన పలువురి కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. స్పందన వరద సహాయ నిధికి విరాళాలను అందించాలనుకునేవారు తమ స్పందన డాట్ ఆర్గ్ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని ఆయన వివరించారు.

వెబ్దునియా పై చదవండి