విద్యార్థుల భద్రతకు సలహా మండలి : గిల్లార్డ్

FILE
ఆస్ట్రేలియాలోని విదేశీ విద్యార్థుల భద్రతా పర్యవేక్షణకు విద్యార్థి సలహా మండలిని ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశ ఉప ప్రధానమంత్రి జూలియా గిల్లార్డ్ ప్రకటించారు. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై దాడులు జరిగిన నేపథ్యంలో విద్యార్థులో భద్రతాభావాన్ని పెంపొందించేందుకే సలహా మండలిని ఏర్పాటు చేసేందుకు పూనుకున్నట్లు గిల్లార్డ్ తెలిపారు.

మెల్‌బోర్న్‌లో రెండు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ విద్యార్థి సదస్సులో పాల్గొన్న జూలియా గిల్లార్డ్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో భద్రతా భావాన్ని పెంపొందించటంతోపాటు, వారి తల్లిదండ్రుల్లో కూడా నమ్మకం కలిగించేందుకే విద్యార్థి సలహా మండలి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని వివరించారు.

ఈ సదస్సులో ముఖ్యంగా విదేశీ విద్యార్థులపై జరుగుతున్న దాడులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. కాగా.. తమ దేశంలో దాదాపు లక్షమంది భారతీయ విద్యార్థులు ఉన్నారనీ, వారి భద్రత కోసం ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని జూలియా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. ఆసీస్ ఉప ప్రధాని జూలియా పై విధంగా చెప్పి ఒక రోజు కూడా గడవక ముందే, మెల్‌బోర్న్‌లో ముగ్గురు భారతీయ యువకులపై మళ్లీ జాత్యహంకార దాడి జరగడం గమనార్హం. ఈ దాడిలో ముగ్గురు భారత యువకులను 70 మంది స్థానిక ఆస్ట్రేలియన్లు తీవ్రంగా గాయపరచి, తమ దేశం వదలి వెళ్లిపోవాలని తీవ్రంగా దూషించిన సంగతి తెలిసిందే..! ఈ నేపథ్యంలో ఆ దేశ ఉప ప్రధాని, ప్రధానమంత్రులు చెప్పుతున్న కథలన్నీ కాకరకాయలేనని నమ్మాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉందన్నది సత్యం.

వెబ్దునియా పై చదవండి