సిక్కు కుటుంబానికి హైకోర్టు తిరస్కారం

గత మే నెలలో మరణించిన ఆర్ట్ డైరెక్టర్ మోహన్ సింగ్ భౌతికకాయానికి తమ మతాచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు, సింగ్ మృతదేహాన్ని తమకు అప్పగించాలంటూ ఆయన కుటుంబ సభ్యులు వేసిన రివ్యూ పిటీషన్‌ను మలేషియా హైకోర్టు తిరస్కరించింది.

ఇప్పటికే సివిల్ కోర్టును ఆశ్రయించిన సింగ్ కుటుంబ సభ్యులు అక్కడ తిరస్కారం ఎదురవటంతో హైకోర్టులో రివ్యూ పిటీషన్ దాకలు చేశారు. ఈ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి రోస్నాని సాబ్... సింగ్ మరణించే నాటికి ముస్లింగానే ఉన్నాడని వ్యాఖ్యానించారు.

1992వ సంవత్సరంలో సింగ్ ముస్లిం మతం స్వీకరించినట్లు సాక్షాధారాలున్నాయని న్యాయమూర్తి వెల్లడించారు. ఇక ఈ విషయంపై పునర్విచారణ జరపాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని ఆయన తేల్చి చెప్పారు. సింగ్ ముస్లింగా మారిపోయాడు కాబట్టి, సంప్రదాయం ప్రకారమే సింగ్ అంత్యక్రియలు జరిపించటం మంచిదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే... గత మే నెల 24వ తేదీన గుండెపోటుతో మోహన్ సింగ్ స్థానిక సంగాయ్ బులాహ్ ఆసుపత్రిలో చనిపోయారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించిన ఆయన కుటుంబ సభ్యులను ఆసుపత్రి వర్గాలు అనుమతించకపోవటంతో వారు కోర్టును ఆశ్రయించారు.

వెబ్దునియా పై చదవండి