హజారే విజయంపై ఎన్నారైల ఆనందోత్సాహం

సోమవారం, 29 ఆగస్టు 2011 (19:13 IST)
సామాజిక కార్యకర్త అన్నా హజారే పన్నెండు రోజుల నిరాహార దీక్షతో దిగివచ్చిన భారత పార్లమెంట్ రాష్ట్ర స్థాయిలో అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మెన్, లోకాయుక్తాల ఏర్పాటుకు ఏకగ్రీవ తీర్మానాన్ని చేయడంతో అమెరికాలో చురుకైన రాజకీయ సంస్థ పీపుల్ ఫర్ లోక్‌సత్తా (పీఎఫ్ఎల్) ప్రత్యేక సంబరాలను నిర్వహించింది.

అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారేకు మద్దతుగా కొన్ని నెలలుగా భారత కాన్సులేట్స్ ముందు, హోస్టన్, బోస్టన్, బే ఏరియా, లాస్ ఏంజెల్స్, అట్లాంటా, చికాగో, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ తదితర ప్రాంతాల్లో పీఎఫ్ఎల్ సభ్యులు ర్యాలీలు, ఆందోళనలు చేశారు.

2011 మార్చిలో శాన్ డీగో నుంచి శాన్ ఫ్రాన్సిస్‌కో వరకు నిర్వహించిన 240 మైళ్ల దండి యాత్ర-2ను పీఎఫ్ఎల్ ప్రాజెక్ట్స్ ఉపాధ్యక్షుడు జవహర్ కంభంపాటి గుర్తుచేసుకున్నారు. భారత్‌లో జరుగుతున్న అవినీతి వ్యతిరేక ఉద్యమాల గురించి ప్రవాస భారతీయులకు అవగాహన కలిగించడం తమ యాత్రలో ఒక లక్ష్యమని జవహర్ పేర్కొన్నారు.

భారత్‌లో అవినీతికి వ్యతిరేకంగా అమెరికాలో తాము చేపట్టిన ఆందోళన కార్యక్రమాల విజయవంతంపై ప్రజలు అనుమానించినప్పటికీ జయప్రకాష్ నారాయణ్, కిరణ్ బేడీ, అరవింద్ కేజ్రీవాల్, ఇతరులు తమను ప్రోత్సహించారని జవహర్ తెలిపారు. అవినీతి రహిత సమాజం కోసం జరిపే పోరాటం పట్ల భారతీయుల దృక్పధంలో మార్పు వచ్చినట్లు చెప్పిన జవహర్, అన్నా హజారేకు మద్దతుగా ప్రవాస భారతీయులు పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి