ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లిన తెదేపా బృందం

ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడులకు గురవుతున్న భారతీయ విద్యార్థులను, ప్రత్యేకించి తెలుగువారిని కలిసి... వారికి మనోధైర్యం కల్పించేందుకుగానూ తెలుగుదేశం పార్టీ బృందం ఒకటి ఆ దేశానికి బయలుదేరి వెళ్లింది.

కాగా, సోమవారం రాత్రి బయలుదేరిన ఈ బృందంలో తెదేపా నేత నామా నాగేశ్వర రావు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిలు ఉన్నారు. వీరు మెల్‌బోర్న్, సిడ్నీ నగరాలకు వెళ్లి అక్కడి భారత విద్యార్థులను కలిసి.. వారికి మనోధైర్యం కల్పించేలా మాట్లాడి, బాసగా నిలవనున్నారు.

ఆ తరువాత తెదేపా బృందం మెల్‌బోర్న్, సిడ్నీ నగరాల ఉన్నతాధికారులను కలిసి... విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, వాటి నివారణకు తగిన చర్యలు చేపట్టే విధంగా ఒత్తిడి తీసుకురానున్నారు.

ఇదిలా ఉంటే... ఆస్ట్రేలియాలో అగంతకుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోన్న శ్రావణ్ కుమార్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పది లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రకటించారు.

శ్రవణ్ చికిత్సకు ఎంత మొత్తం ఖర్చయినా భరించాల్సిందిగా భారత హై కమీషన్‌ను కోరినట్లు సీఎం కార్యాలయం సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. శ్రావణ్ చికిత్సకు వెచ్చించిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగీ చెల్లిస్తుందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి