పాఠశాల అభివృద్ధికి ఎన్నారై నవతాగ్ చేయూత

కుమారుడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రవాస భారతీయుడు నవతాగ్ ఖున్‌ఖునా.. అధ్వాన్న స్థితిలో ఉన్న ఓ పాఠశాల కేంద్రాన్ని పునరుద్ధరించేందుకు శ్రీకారం చుట్టారు. తమ గ్రామంలో దయనీయ స్థితిలో ఉన్న పాఠశాలను అభివృద్ధి చేసి, ఆ రకంగా ప్రియ పుత్రుడికి నివాళి అర్పించాలని ఈ తండ్రి భావిస్తున్నారు.

స్వగ్రామంలో తమ ఇంటికి సమీపంలో ఉన్న పాఠసాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించాననీ, అందులో భాగంగా పాఠశాలలో తరగతి గదులను నిర్మించే చర్యలు చేపడతానని నవతాగ్ వెల్లడించారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా.. జాతి, మత పట్టింపులు లేకుండా అందరితో కలసిపోయే తన కుమారుడి ఆత్మకు ఈ రకంగా శాంతి చేకూర్చాలని భావిస్తున్నానని ఆయన కన్నీళ్ల పర్యంతమయ్యారు.

ఇదిలా ఉంటే... కుటుంబ సభ్యులందరితో సరదాగా గడపాలని పంజాబ్‌లోని తాతగారి స్వగ్రామం హిరయన్‌కు మూడు నెలల క్రితం వచ్చాడు డేమియన్ సింగ్ ఖున్‌ఖునా అనే పదేళ్లబ్బాయి. ఈ క్రమంలో ఏఫ్రిల్ 15వ తేదీన అస్వస్థతగా ఉందంటూ ఫిర్యాదు చేసిన డేమియన్ అదే రోజు సాయంత్రం ఉన్నఫళంగా మరణించాడు. ఆడుతూ, పాడుతూ.. అందరితో కలుపుగోలుగా ఉండే ఈ చిన్నారి మరణం.. తండ్రి అయిన నవతాగ్‌ను ఓ సామాజిక సేవా కార్యక్రమానికి పూనుకునేలా చేసింది.

వెబ్దునియా పై చదవండి