భారతీయతను నేర్పించాల్సిందే: గుజరాతీ ఎన్నారైలు..!

FILE
భారతీయ సంప్రదాయాలను, విలువలు.. మూడో తరానికి అందకుండా పోతాయేమోనని యూఎస్, యూకేలలో నివసిస్తున్న ప్రవాస భారతీయ గుజరాతీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకనే భారతీయ మూలాలను మర్చిపోకుండా ఉండేందుకు తమ తరువాత తరానికి ఇప్పటినుంచే భారతీయత గురించి తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారంటున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా, బ్రిటన్‌లలో ప్రవాస భారతీయ గుజరాతీ ప్రజానీకం పెద్ద సంఖ్యలో స్థిర నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నారు. అయితే వివిధ కారణాల రీత్యా తాము విదేశాలలో ఉంటున్నప్పటికీ.. పిల్లలకు భారతీయ సంప్రదాయాలు, విలువలు అందించాల్సిన బాధ్యత తమపై ఉందనీ గుజరాతీ ఎన్నారైలు భావిస్తున్నారు. అలా భారతీయతను తమ పిల్లలకు తెలియజెప్పనిపక్షంలో వారి తరువాత తరానికి భారతీయత గురించి తెలియకుండాపోయే ప్రమాదం ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్-అమెరికన్ అసోసియేషన్స్ (ఎన్ఎఫ్‌ఐఏ) అధ్యక్షుడు సీకే పటేల్ ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. విదేశీ సంస్కృతిలో పెరుగుతున్న ప్రవాస గుజరాతీలలోని మూడో తరంవారు విదేశీ మోజులో పడిపోయి భారతీయ సంప్రదాయం, సంస్కృతి, విలువలను విస్మరించే ప్రమాదం ఉన్నట్లు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. అందుకనే వారికి చిన్నవయస్సునుంచే భారతీయత గురించి తెలియజెప్పేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు.

వెబ్దునియా పై చదవండి