విదేశీ కార్మికుల నిషేధంపై సమీక్ష : ఎస్. సుబ్రమణ్యం

విదేశీ ఉద్యోగుల నియామకాలపై ఉండే నిషేధాన్ని సమీక్షించే ఆలోచనలో ఉన్నట్లు.. మలేషియన్ మానవ వనరుల శాఖా మంత్రి ఎస్. సుబ్రమణ్యం "తమిళ నేషన్" అనే పత్రికకు వెల్లడించారు. కాగా.. మలేషియాలో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో స్థానిక కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిన కారణంగా.. విదేశీ కార్మికులపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే..!

ఈ విషయమై సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ సంబంధమైన పరిశ్రమలోకి విదేశీ ఉద్యోగులను అనుమతించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. విదేశీ కార్మికులపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేయక పోయినట్లయితే ఆ వ్యవస్థ దారుణంగా దెబ్బతినే అవకాశాలు లేకపోలేదని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. స్థానిక కార్మికులకే ప్రాధాన్యత ఇవ్వాలని, అక్కడి యాజమాన్యాలకు మలేషియా ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలను జారీ చేసింది. అయితే నైపుణ్యం, విధేయత కలిగిన కార్మికులకు మాత్రమే అక్కడ ఉపాధి లభిస్తోంది. ఇక్కడి భవన నిర్మాణాలు, హోటళ్లు, ప్లాంటేషన్ రంగాలలో పనిచేసేందుకు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండోనేషియా, భారత్‌ల నుంచి ఎక్కువ మొత్తంలో కార్మికులు వలస వెళ్తున్నారని పలు సర్వేలు చెబుతుండటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి