కీర్తి కిరీటాలను ఆఫీసుల్లోనే వదిలేయాలి: ఇంద్రా నూయి

PTI
"ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళ"లాంటి గుర్తింపులు, కీర్తి కిరీటాలన్నింటినీ ఆఫీసుల్లోనే వదిలేయాలని.. వాటివల్ల నిజానికి ఒరిగేదేమీ లేదని ప్రవాస భారతీయ మహిళ, పెప్సికో చీఫ్ ఇంద్రా నూయి వ్యాఖ్యానించారు. ఫోర్బ్స్, ఫార్చ్యూన్‌లాంటి పత్రికలు ఇచ్చే బిరుదులవల్ల ఎలాంటి ఉపయోగం లేదనీ, ముఖ్యంగా వీటి వల్ల బిరుదులు పొందినవారికంటే ఇచ్చిన ఆ పత్రికలకే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

ఎకనమిక్ క్లబ్ సభ్యులను ఉద్దేశించి ఇంద్రా నూయి మాట్లాడుతూ.. శక్తివంతమైన మహిళలు అంటూ అంతర్జాతీయ పత్రికలు ఇచ్చే గుర్తింపులు, గౌరవాలన్నీ ఎందుకూ పనికిరావన్నారు. ఈ రకంగా ఆ పత్రికలు వాటి సేల్స్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి తప్ప మరోటి కాదని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా ఇంద్రా నూయి 2001వ సంవత్సరంలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని సభ్యులతో పంచుకున్నారు. పెప్సికో గ్లోబల్ ప్రెసిడెంటుగా తాను ఎంపికై విషయాన్ని ఇంటికెళ్లి తన తల్లితో ఉత్సాహంగా చెప్పగా, ఆమె ముభావంగా కనిపిందన్నారు. ఆమె పెద్దగా స్పందించక పోవటంతో తాను గట్టిగా నిలదీశాననీ.. అయితే "ఆఫీసు విషయాలను ఇంటిదాకా మోసుకురావద్దని" చాలా సున్నితంగానే అయినా ఆమె స్పష్టంగా చెప్పిందన్నారు.

ఓ మహిళ ఆఫీసుల్లో ఎంత పెద్ద హోదాలలో ఉన్నప్పటికీ దాన్ని అక్కడే వదిలిపెట్టి రావాలని తన తల్లి ఆరోజు చెప్పినట్లు ఇంద్రా నూయి గుర్తు చేసుకున్నారు. ఇంటికి చేరిన మహిళ ఒక భార్యగా, కూతురిగా, గృహిణిగా మారిపోవాలని తన తల్లి చెప్పిన మాటలను ఆరోజు నుంచి ఈరోజువరకూ తూ.చ తప్పకుండా పాటిస్తున్నానని నూయి వివరించారు.

వెబ్దునియా పై చదవండి