గృహ హింస బాధితుల సేవలో "భారత్ గ్రూప్"

గృహ హింస బాధితులైన దక్షిణాసియా మహిళలకు చేయూతనిచ్చేందుకు "భారత్ యూత్ గ్రూప్" అనే సంస్థ ముందుకు వచ్చింది. బాధిత మహిళలకు ఆశ్రయం కల్పించేందుకు అవసరమైన నిధుల సేకరణకుగానూ... ఈ సంస్థ మే 30న "ఫ్యూజన్ 2009" పేరుతో పలు సాంస్కృతిక పోటీలను నిర్వహించింది.

నార్త్ వేల్స్‌లోని పెన్ బ్రూక్ మిడిల్ స్కూల్‌లో నిర్వహించిన ఈ ఫండ్ రైజింగ్ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా... శాస్త్రీయ, జానపద, సినిమా నృత్యాలు, శాస్త్రీయ, లలిత సంగీతం, ఇన్‌స్ట్రుమెంటల్ తదితర విభాగాల్లో పోటీలను భారత్ గ్రూప్ నిర్వహించింది. కాగా.. ఈ పోటీలలో పెన్సిల్వేనియా, న్యూయార్క్, న్యూజెర్సీ తదితర రాష్ట్రాల నుంచి 160 మందికి పైగా ఉత్సాహవంతులైన చిన్నారి కళాకారులు పాల్గొనగా, 450 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు.

ఈ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ద్వారా 8,550.01 డాలర్ల విరాళం సమకూరినట్లు భారత్ యూత్‌ గ్రూప్ నిర్వాహకులు... పవన్ గేదెల, అనూజ గేదెల ప్రకటించారు. ఈ మొత్తాన్ని పెన్సిల్వేనియాలోని "సర్వీస్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ విమెన్ ఎగెనెస్ట్ అబ్యూజ్" అనే సేవా సంస్థకు అందజేయనున్నట్లు వారు ప్రకటించారు.

ఇదే సందర్భంగా... భారత్ యూత్ గ్రూప్ అధ్యక్షురాలు కీర్తన శెట్టి తమ సంస్థ సభ్యులను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ... తాము సేవా సంస్థను స్థాపించడానికి వెనుక ఉన్న కారణాలను వివరించారు. అలాగే 2009-10 సంవత్సరానికి ఎంపికైన కమిటీ సభ్యులను కూడా ఆమె పరిచయం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరై, విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ, కీర్తన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి