తొలిసారిగా కువైట్ పార్లమెంట్‌కు నలుగురు మహిళలు

కువైట్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు మహిళలు ఆదేశ పార్లమెంట్‌కు తొలిసారిగా ఎంపికై చరిత్ర సృష్టించారు. వీరిలో... అసీల్ అల్ అవధి, రులా దస్తీ మరియు 2005లో మొట్టమొదటి మహిళా మంత్రిగా పనిచేసిన మాజీ ఆరోగ్య మంత్రి మస్సౌమా అల్ ముబారక్, సల్వా అల్ జాసర్ అనే నలుగురు మహిళలు ఉన్నారు.

ఓ ప్రాంతం నుంచి ఎన్నికైన మొదటి పదిమందిలో అవధి రెండవ అభ్యర్థిగా, రులా 7వ అభ్యర్థిగా నిలిచి తమ సత్తాను చాటుకోగా, ఇస్లామిస్ట్ గ్రూపులు మాత్రం పరాజయాన్ని చవిచూశాయి. ఇస్లామిక్ దేశమైన కువైట్‌లో ఇప్పటివరకూ పురుషుల ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోన్న సంగతి విదితమే. 2005లో అక్కడి మహిళలకు ఓటు హక్కును కల్పించారు.

2006, 2008లో జరిగిన ఎన్నికల్లో మహిళలెవరూ గెలవలేకపోయారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం 50 సీట్లు కలిగిన పార్లమెంటుకు 210 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో 16 మంది మహిళలు కాగా, వీరిలో పై నలుగురు విజయం సాధించి.. పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

ఫలితాల అనంతరం అవధి మాట్లాడుతూ... కువైట్ ప్రజాస్వామ్యంలో మహిళలకు దక్కిన విజయమని సంతోషం వ్యక్తం చేశారు. తాను ఖచ్చితంగా విజయం సాధిస్తానని తెలుసని, అయితే రెండో స్థానంలో నిలుస్తానని మాత్రం ఊహించలేదని ఆమె అన్నారు. కాగా... అవధి కువైట్ యూనివర్సిటీలో పొలిటికల్ ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈమె టెక్సాస్‌లోని అస్టిన్ యూనివర్సిటీనుంచి డాక్టరేట్‌ను పొందారు.

వెబ్దునియా పై చదవండి