దుబాయిలో తెలుగు మహిళా సంఘం "వేవ్"

గల్ఫ్ దేశమయిన దుబాయ్‌లో ప్రప్రథమంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రవాసాంధ్ర మహిళలు "వేవ్ ఉమెన్ ఆఫ్ ఆంధ్ర కల్చర్ అండ్ విజన్ ఇన్ ఎమిరేట్స్ (వేవ్)" అనే ప్రవాసాంధ్ర మహిళా సంఘాన్ని నెలకొల్పారు. సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల నిర్వహణలో కఠిన ఆంక్షలు అమలులో ఉన్న గల్ఫ్ దేశంలో ఈ దిశగా తెలుగు వనితలు ఒక అడుగు ముందుకేయడం గర్వకారణం.

ఇటీవల దుబాయిలోని రాషేద్ ఆడిటోరియంలో వేవ్ తన రెండవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ కార్యక్రమాన్ని మూడు గంటలపాటు మహిళలే నిర్వహించిన రికార్డును కూడా వేవ్ సొంతం చేసుకుంది. కాగా... ఈ ఉత్సవాలకు ప్రముఖ సినీ నటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వేవ్ అధ్యక్షురాలు శ్రీమతి గీత మాట్లాడుతూ... గత రెండు సంవత్సరాలుగా సామాజిక సేవా రంగంపై ఆసక్తి ఉన్న ఆంధ్ర మహిళలను గుర్తించి ఒకే వేదికపై సమన్వయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, యుఏఈలో నివసిస్తున్న తెలుగు మహిళలపై ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లుగా ఆమె చెప్పారు.

ఉపాధికై వచ్చి మోసపోతున్న తెలుగు మహిళలకు వీలయిన విధంగా వాలంటీర్ల ద్వారా సహాయం చేయడంతోపాటు, వారు గల్ఫ్‌కు బయలుదేరక ముందు స్వంత జిల్లాలలో శిక్షణ మరియు అవగాహనా తరగతులను నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరినట్లుగా కూడా గీత వివరించారు. ఇంకా, బాలబాలికలకు మరియు తెలుగు కుటుంబాల కోసం, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.

వెబ్దునియా పై చదవండి