నందిత "ఫిరాఖ్"కు పాక్‌లో ప్రశంసలు

ప్రముఖ బాలీవుడ్ నటి నందితాదాస్ తొలిసారిగా దర్శకత్వం వహించి, నిర్మించిన "ఫిరాఖ్" చిత్రంపై పాకిస్థాన్‌లో ప్రశంసల వర్షం కురిసింది. 2002లో జరిగిన గుజరాత్ హింసాత్మక నేపథ్యంలో తీసిన ఈ చిత్రం.. పాక్‌లోని ఏడవ 'కారా ఫిల్మ్ ఫెస్టివల్‌'లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది.

ఈ సందర్భంగా నందితాదాస్ మాట్లాడుతూ... ముంబయి పేలుళ్ల తర్వాత "ఫిరాఖ్" చిత్రాన్ని పాకిస్థాన్‌లో ప్రదర్శించటం అవసరంగా భావించాననీ, ఇందుకోసం కరాచీకి రావడానికి తాను ఎంతో శ్రమపడ్డానని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య మళ్లీ మంచి సంబంధాలు కొనసాగాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచమంతటా శాంతి నెలకొనాలనీ, అందుకు కళాకారులు ఇలాంటి సమస్యలపట్ల ఏదో ఒక స్థాయిలో, సందర్భంలో స్పందించాలని నందిత పేర్కొన్నారు. అయితే విశ్వవ్యాప్తంగా పూర్తి స్థాయి శాంతిని నెలకొల్పడం కోసం మన జీవితకాలం సరిపోతుందో లేదో తెలియదుగానీ, అందుకు తగిన పోరాటం మాత్రం కొనసాగిస్తూనే ఉండాలని ఆమె సూచించారు.

ఇదిలా ఉంటే... పాక్‌కు చెందిన మెహ్రీన్ జబ్బార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న "రామ్‌చంద్ పాకిస్థానీ" అనే చిత్రంలో నందితాదాస్ పాకిస్థాన్ గడ్డపై విశేషమైన గుర్తింపును, అనేకమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. తాజాగా తమ అభిమాన నటి రూపొందించిన "ఫిరాఖ్" చిత్రాన్ని కూడా బాగా ఆదరించిన పాక్ ప్రజలు ఉత్తమ చిత్రంగా గుర్తింపునివ్వడం విశేషం.

వెబ్దునియా పై చదవండి