పిల్లల్ని హతమార్చిన భారత సంతతి మహిళ

FILE
బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి‌షైర్‌లోని స్ట్రెంథామ్‌లో నివసిస్తున్న 41 సంవత్సరాల భారత సంతతి మహిళ రేఖా కుమారి బాకర్ తన సొంత పిల్లలైన దేవినా (16), జాస్మిన్ (13)లను అత్యంత కిరాతకంగా హతమార్చింది. నిద్రిస్తున్న పిల్లల్ని కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపేసిన ఆమె ఏకంగా తన స్నేహితురాలైన కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి ఘోరం చేశాను, పిల్లల్ని చంపేశాను అంటూ విలపించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో రేఖా కుమారి పెద్ద కూతురు దేవినా శరీరంపై 39 కత్తిపోట్లున్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసేముందు ఇద్దరు పిల్లల్ని షాపింగ్‌కు తీసుకెళ్లడంతో వారు సంతోషంగా ఉండటాన్ని చూసిన తాను చంపే కార్యక్రమాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నానని ఆమె చెప్పడం వింటున్న ఎవరికైనా మనసు కలచి వేస్తుంది.

ఈ విషయమై రేఖా కుమారి న్యాయవాది జాన్ ఫార్మర్ మాట్లాడుతూ... విడాకులు తీసుకున్న అనంతరం పిల్లల విషయానికి సంబంధించి ఆమెకు, ఆమె మాజీ భర్త డేవిడ్ బాకర్‌కు మధ్య గొడవలు జరగటం.. చేస్తున్న ఉద్యోగం పోవటంతోపాటు, బాయ్‌ఫ్రెండ్ నుంచి నిరాకరణ ఎదురుకావడం.. తదితరాలన్నీ ఎదురుకావటంతో మానసిక సంఘర్షణకు లోనైన ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వివరించారు.

అంతేగాకుండా తన పిల్లలు మాజీ భర్త ప్రియురాలితో సన్నిహితంగా మెలగటం కూడా రేఖ ఈ దారుణానికి పాల్పడేందుకు కారణమయ్యిందని ఆమె తరపు లాయర్ తెలియజేశారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని లాయర్ వాదించినప్పటికీ.. ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని న్యాయమూర్తి జస్టిస్ బీన్ వెల్లడించటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి