పూజారుల భద్రతకు నేపాల్ హామీ : నిరుపమారావు

FILE
నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయంలో పనిచేస్తున్న భారత పూజారుల భద్రతకు, ఆ దేశ ప్రభుత్వం గట్టి హామీని ఇచ్చిందని.. భారత విదేశాంగ శాఖా కార్యదర్శి నిరుపమారావు వెల్లడించారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పై విధంగా స్పందించారు.

ఇదిలా ఉంటే.. పదిహేను రోజుల క్రితం నేపాల్‌లోని పశుపతినాథ్ దేవాలయంలో పనిచేస్తున్న భారత పూజారులపై నేపాల్ మావోయిస్టు కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ పర్యటిస్తున్న నిరుపమారావు ముందుగా ఆలయంలో పూజలు నిర్వహించారు.

అనంతరం.. "పశుపతి ఏరియా డెవలప్‌మెంట్ ట్రస్ట్" అధికారులను కలిసిన నిరుపమారావు దాడి ఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై ప్రభుత్వ అధికారులతో చర్చించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. దాడి ఘటనపై నేపాల్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేయటంతోపాటు, భారత పూజారుల భద్రతకు సంబంధించి అన్నిరకాల చర్యలను తీసుకుంటామని చెప్పినట్లు తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి