భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా దేవీసింగ్ పాటిల్ గౌరవార్థం.. బ్రిటన్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు ఘనంగా ఓ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారత హై కమీషనర్ లలిత్ సూరి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ విందులో పలువురు ప్రవాస భారతీయ ప్రముఖులు, వ్యాపారులు, మేధావులూ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి నోబెల్ బహుమతి గ్రహీత వి. రామకృష్ణన్ను అభినందించారు.
ఈ సందర్భంగా పాటిల్ మాట్లాడుతూ.. విదేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులంతా భారతదేశ ఆర్థికాభివృద్ధికి సహకరిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు, అవసరాల గురించి మిగిలిన వారికంటే, మీకే బాగా తెలుసునని.. కాబట్టి దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ వారి, వారి స్థాయిల్లో కృషి చేయాలని రాష్ట్రపతి ఎన్నారైలకు పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే.. మారియట్ ఐదు నక్షత్రాల హోటల్లో జరిగిన ఈ విందు సమావేశానికి ప్రముఖ పారిశ్రామికవేత్తలు లార్డ్ స్వరాజ్పాల్, ఎస్పీ హిందూజా, నాథ్ పూరీ, బెంబ్లే హోటల్ యజమాని జోగిందర్ సంగర్, కర్రీ కింగ్ గులామ్ నూన్లు.. నోబెల్ గ్రహీత వి. రామకృష్ణన్, కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరీశ్వరి తదితరులు హాజరయ్యారు.
కాగా... విందు అనంతరం ప్రతిభా పాటిల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మాగాంధీ వస్తువులను ఎంతో గౌరవంగా భారత్కు తీసుకెళ్తామని చెప్పారు. స్వదేశానికి వెళ్లిన తరువాత వాటిని ఎక్కడ ఉంచేదీ నిర్ణయిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. మహాత్ముడు రాసిన కొన్ని అరుదైన లేఖలను, స్వయంగా ఆయన నేసిన ఖాదీ వస్త్రాన్ని బ్రిటన్ ఎన్నారైలు సేకరించి, రాష్ట్రపతికి బహూకరించనున్న సంగతి తెలిసిందే..!