మలేషియాలో పెరుగుతున్న భారత మహిళల "విడాకులు"

FILE
మలేషియాలో విడాకులు తీసుకునే భారతీయ మహిళల సంఖ్య పెరుగుతోందనీ, ముఖ్యంగా ఉద్యోగాలు చేయని భర్తలను వదిలేసేందుకు వారు ఏ మాత్రం వెనుకాడటం లేదని.. స్థానిక తమిళ పత్రిక ఒకటి వెల్లడించింది. ముఖ్యంగా జోహార్ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు ఆ పత్రిక పేర్కొంది.

ఇంతకుమునుపు భార్యల నుంచి విడిపోయేందుకు భర్తలు న్యాయస్థానాలను ఆశ్రయించేవారనీ, అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందనీ.. భర్తల నుంచి విడిపోయేందుకు భారత మహిళలు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని "మలేషియా నన్‌బన్" పత్రిక తెలిపింది. "గందరగోళ ధోరణి" అనే పేరుతో ప్రచురించిన ఈ వార్తా కథనంలో.. సింగపూర్‌లో ఉద్యోగాలు చేస్తున్న భారత మహిళల్లో 80 శాతంమంది విడాకుల కోసం ఎదురుచూస్తున్నారన్న విషయాన్ని అందులో ఉటంకించింది.

ఇదిలా ఉంటే.. భర్తల నుంచి ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో చెప్పేందుకు చాలామంది మహిళలు నిరాకరించినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఏ పనీ చేయకుండా భార్యల జీతంపై ఆధారపడుతున్నందువల్లనే ఎక్కువమంది వివాహితలు విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా.. పెళ్లయిన ఆరు నెలల నుంచి పది సంవత్సరాల లోపు జంటలు ఇలా అధికంగా విడిపోతున్నవారిలో ఉన్నట్లు ఆ పత్రికా కథనం వివరించింది.

వెబ్దునియా పై చదవండి