మలేషియాలో భారతీయ మహిళ మృతి

మలేషియాలో తన నలుగురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ భారతీయ మహిళ మరణించింది. దొంగతనానికి పాల్పడ్డాడనే నెపంతో తన సోదరుడిని పోలీసులు కాల్చి చంపటంతో.. కలత చెందిన ఆర్. సీత అనే భారత మహిళ తన పిల్లలకు పురుగుల మందిచ్చి, తానూ తాగింది.

అయితే సీతను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. గత ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆమె మరణించగా.. పిల్లలు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న అక్కడి హిందూ రైట్స్ యాక్షన్ ఫోరమ్ (హిండ్రాఫ్) నేత పీ. ఉదయ కుమార్, ప్రతిపక్ష ఎంపీలు మాణిక్య వాసంగం, మనోహరన్‌లు... సీత మృతదేహంతో పార్లమెంట్ ముందు ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు.

ఇదిలా ఉంటే.. సీత సోదరుడు సురేంతిరాన్ (24)తో సహా ఐదుగురు భారతీయులను, దొంగతనానికి పాల్పడ్డారనే ఆరోపణలతో నవంబర్ నెల మొదట్లో మలేషియా పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటనపై స్థానిక ప్రవాస భారతీయ రాజకీయ పార్టీలు, మానవ హక్కుల సంఘాలు అభ్యంతరం తెలియజేస్తూ... తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

వెబ్దునియా పై చదవండి