భారత తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించిన ప్రతిభా పాటిల్కు మరో అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ నుంచి ఆతిథ్యం అందుకున్న తొలి రాచరికేతర దేశాధినేతగా మన రాష్ట్రపతి చరిత్రకెక్కనున్నారు.
ఈ మేరకు బ్రిటన్ రాజకుటుంబం నుంచి అందిన ఆహ్వానంపై ఈ సంవత్సరం అక్టోబర్ 27 నుంచి మూడు రోజులపాటు ప్రతిభా పాటిల్ ఆ దేశంలో పర్యటించనున్నారు. రాణి ఎలిజబెత్ ఆతిథ్యం అందుకోనున్న ప్రతిభ రాణి అధికార నివాసమైన విండ్సర్ కాజల్లో బస చేస్తారు.
లండన్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విలాసవంతమైన భవనం అంటే రాణి ఎలిజబెత్కు చాలా ఇష్టం. 1972లో నెదర్లాండ్స్ రాణి జూలియానా, 1974లో డెన్మార్క్ రాణి మార్గిత్, 2000లో నెదర్లాండ్స్ రాణి బీట్రిక్స్లు ఎలిజబెత్ ఆతిథ్యం పుచ్చుకున్నవారిలో ఉన్నారు.
అయితే వీరందరూ రాణి ఆహ్వానంపై కాకుండా, బ్రిటన్ ప్రధానమంత్రుల ఆహ్వానంపై పర్యటించారు. ఇప్పటిదాకా రాణి రాచరిక దేశాధినేతలు మినహా మరెవరినీ తమ దేశానికి ఆహ్వానించలేదు. ఆ గౌరవం అధుకున్న తొలి రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ రికార్డులకెక్కారు.
ఈ సందర్భంగా వచ్చే ఏడాదిలో భారత్లో నిర్వహించే కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవానికి రాణి ఎలిజబెత్ను మన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆహ్వానించనున్నారు. కాగా, తన పర్యటనలో ఆమె ఆ దేశ ప్రధాని గార్డెన్ బ్రౌన్తో చర్చలు జరుపనున్నారు.