సునిధికి దక్షిణాఫ్రికాలో చేదు అనుభవం

ప్రముఖ బాలీవుడ్ గాయని సునిధి చౌహాన్‌కు దక్షిణాఫ్రికాలో ఓ చేదు అనుభవం ఎదురయ్యింది. సునిధి ధరించే ఆభరణాలను జప్తు చేసేందుకు డర్బన్ హైకోర్టు అనుమతి ఇవ్వటంతో రెండు రోజులపాటు ప్రదర్శన ఇచ్చేందుకు అక్కడికి వెళ్లిన ఆమెకు గొంతులో పచ్చివెలగకాయ పడినట్లయ్యింది.

మొదటి షో ఇచ్చేందుకు సునిధి సిద్ధమవుతున్న తరుణంలో ఆమె నుంచి తనకు రావాల్సిన 5,300 డాలర్ల మొత్తాన్ని ఇప్పించాలంటూ.. స్థానిక వ్యాపారవేత్త సునీల్ సింగ్ హైకోర్టును ఆశ్రయించటంతో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో చేసేదిలేక సునిధి మూగనోము పట్టాల్సి వచ్చింది.

వివరాల్లోకి వస్తే... డర్బన్‌లో ఓ సంగీత ప్రదర్శన ఇచ్చేందుకుగానూ 8 సంవత్సరాల క్రితం సునిధి చౌహాన్‌కు సునీల్ సింగ్ పై మొత్తాన్ని ఇచ్చారు. 2001 జూన్‌లో ఆమెకు డబ్బు ఇచ్చినట్లుగా ఆయన చెబుతున్నారు. అదే సంవత్సరం సెప్టెంబర్‌‌లో అమెరికాపై దాడులు జరగటంతో సునిధి ప్రదర్శన వాయిదా పడింది.

తనవద్ద తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకుండా, మరుసటి ఏడాదే సునిధి మరో ప్రమోటర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంది. 2003, 2004 సంవత్సరాలలో ప్రోగ్రామ్ ఇవ్వాలని ఆమెని కోరినప్పటికీ... అంగీకరించలేదని సింగ్ పేర్కొన్నారు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, హైకోర్టు సింగ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.

వెబ్దునియా పై చదవండి