అందచందాల సింగారం సింగపూర్‌

ఆదివారం, 3 జూన్ 2007 (18:05 IST)
దక్షిణ తూర్పు ఆసియాలో వున్న నికోబార్‌ ద్వీపానికి సుమారు 1,500 కిలోమీటర్ల దూరంలో ఓ చిన్న అందమైన, అభివృద్ధి చెందిన దేశం సింగపూర్‌. గత 20 సంవత్సరాల నుంచి సింగపూర్‌ ఓ పర్యాటక కేంద్రంగా, వ్యాపార లావాదేవీలకు అనుకూలమైన దేశంగా పేరుగాంచింది. ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున వ్యాపారాభివృద్ధికై స్టెమ్‌పోర్డ్ రెఫల్మ్ 1819లో అధునాతన సింగపూర్‌ను స్థాపించాడు.

14వ శతాబ్దంలో ఉమిత్ర ద్వీప రాజకుమారుడు వేట సమయంలో ఓ ద్వీపానికి వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో సింహాలు ఎక్కువగా సంచరించడం చూసి ఆ ద్వీపానికి `సింగాపురా' అని పెట్టగా, కాలక్రమేణా అది సింగపూర్‌గా పరిణతి చెందిందని చరిత్ర చెబుతోంది.

అర్థశాస్త్రంలో సింగపూర్‌ని `ఆధునిక చమత్కారం'గా పేర్కొన్నారు. ఇది ప్రకృతి వనరులకు నిలయం. దీని జనాభా 35 లక్షలు. ఇక్కడ 8 శాతం భారతీయులు వున్నారు. మిగిలిన దేశాలతో పోల్చితే ఈ దేశ జనాభా తక్కువైనప్పటికీ చిరకాలంలోనే అభివృద్ధిని సాధించింది.

సింగపూర్‌లో ముఖ్యంగా మూడు మ్యూజియంలు, జూరోంగ్‌ బర్డ్ పార్క్, రెప్టయిల్‌ పార్క్, జూలాజికల్‌ గార్డెన్‌, సైన్స్ సెంటర్‌ సెంటోసా ద్వీపం, పార్లమెంట్‌ హౌస్‌, హిందూ, చైనా, బౌద్ధ మందిరాలు పర్యాటకులను అలరిస్తాయి. సింగపూర్‌ మ్యూజియంలో సింగపూర్‌ స్వాతంత్య్రానికి సంబంధించిన పూర్తి సమాచారం లభిస్తుంది.

కల్చరల్‌ మ్యూజియంలో వివిధ రకాల పండుగల గురించి తెలుస్తుంది. ఆసియా పక్షుల కోసం ప్రత్యేకించిన జురోంగ్‌ బర్డ్ సింగపూర్‌లో వుంది. ఇది ఆసియాలోనే పెద్ద పార్క్. ఇలా సింగపూర్‌ అందచందాలతో సింగారమైంది.

వెబ్దునియా పై చదవండి