మిథున రాశివారికి జూలై 14 వరకు ద్వితీయము నందు బృహస్పతి, ఆ తదుపరి అంతా తృతీయము నందు, ఈ సంవత్సరము అంతా చతుర్థము నందు రాహువు, రాజ్యము నందు కేతువు, ఈ సంవత్సరం అంతా షష్ఠమము నందు శని సచారం జరుగుతుంది.
ఈ రాశివారి గోచారం పరీక్షించగా... 'యదృశ్య భావనా యాత్ర సిద్ధిర్ భవతి తద్రిశీ' అన్నట్లుగా మీరు ఎటువంటి భావనలో ఉంటారో, ఎంటువంటి ఆలోచనలో ఉంటారో అటువంటి ఫలితాలే ఈ సంవత్సరం మీరు పొందగలుగుతారు. షష్ఠమ స్థానమునందు శని సంచారం వల్ల ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. నరాలు, ఎముకలు, చర్మానికి సంబంధించిన చికాకులు, స్థిరబుద్ధి లేక పోవడం వంటివి అధికంగా ఎదుర్కొంటారు. విద్యార్థులతో చైతన్యం అధికమవుతుంది.
అనుకున్నదానికన్నా కూడా ఒకడుగు ముందుకు వెళతారు. వైద్య, ఇంజనీరింగ్ విద్యార్థునులలో మార్పు కానరాగలదు. స్త్రీలకు చుట్టుపక్కల వారితో మెలకువ అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి ఫోటోగ్రాఫర్లకు, కళాకారులకు, క్రీడా రంగాల్లో వారికి సమయస్ఫూర్తికి అనుకోని రాణింపు లభించగలదు. వాణిజ్య రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలించగలవు. ఆహార వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. శెనగలు, కంది, పసువు, ఉలవలు, మినుములు, ధాన్యానికి సంబంధించిన వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కొత్తకొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. హోటల్, తినుబండ వ్యాపారస్తులకు సామాన్యమైన అభివృద్ధి కానరాగలదు.
కాంట్రాక్టర్లు మంచి మంచి కట్టడాలు నిర్మిస్తారు. వాతావరణంలో మార్పు వల్ల వ్యవసాయ, తోటల రంగాల్లో వారికి చికాకులు తలెత్తిన సమసిపోగలవు. వివాహం కానివారు మొదటి భాగంలో శుభవార్తలు వింటారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. ఫైనాన్సు రంగాల్లో వారికి సమస్యలు తలెత్తుతాయి. బంగారం వెండి, లోహ, వస్త్ర వ్యాపారస్తులకు ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వెళతారు. స్వతంత్ర జీవనంపై ఆసక్తి అధికమవుతుంది. వైద్యులు అధిక శ్రమచేసి సత్ఫలితాలు అందించి మాటపడతారు.
ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు కొంతమంది తప్పుదోవ పట్టించవచ్చు. మెళకువ అవసరం. వైజ్ఞానిక రంగాల్లో వారికి, పరిశోధకులకు గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు కొంతమంది వాయిదా పడటం మంచిది. రాజకీయాల్లో వారికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. మీలో నూతన ఉత్తేజం కానవస్తుంది. పాడి, పరిశ్రమ రంగాల్లో వారికి, మత్య్సు రంగాల్లో వారికి, కోళ్ళ వ్యాపారస్తులకు సంతృప్తి, అభివృద్ధి కానరాగలదు. ఈ సంవత్సరం సాహసప్రయత్నాలు విరమించండి.
ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవడం వల్ల లేక వినడం వల్ల కార్తికేయుని ఆరాధించడం వల్ల అన్ని విధాలా అభివృద్ధి చేకూరుతుంది. విద్యార్థులు శారదా దేవిని ఆరాధించడం వల్ల స్థిరబుద్ధి, విద్యాభివృద్ధి చేకూరగలదు.
** మృగశిర నక్షత్రం వారు మారేడు చెట్టు, ఆరుద్ర నక్షత్రం వారు చింత చెట్టును, పునర్వసు నక్షత్రం వారు గన్నేరు చెట్టును దేవాలయాల్లో గానీ, విద్యా సంస్థల్లో గానీ, ఖాళీ ప్రదేశాల్లో గానీ నాటి వాటి పురోభివృద్ధికి తోడ్పడిన మీకు అభివృద్ధి కానవస్తుంది.
మృగశిర నక్షత్రం వారు జాతి పగడం, ఆరుద్ర నక్షత్రం వారు ఎర్రగోమేధికం, పునర్వసు నక్షత్రం వారు కనకపుష్యరాగం లేదా వైక్రాంతమణి అనే రాయిని ధరించిన శుభం కలుగుతుంది.