#ValmikiJayanti.. ''కౌసల్యా సుప్రజా రామ'' సుప్రభాత కర్త ఆయనే.. రామాయణాన్ని..

ఆదివారం, 13 అక్టోబరు 2019 (11:57 IST)
ఆశ్వయుజ పౌర్ణమి (అక్టోబర్ 12, 2019) రోజున మరో విశిష్టత వుంది. ఈ రోజు రామాయణ ఇతిహాస కర్త అయిన వాల్మీకి మహర్షి జయంతి. ఆ రోజున ఆయన రాసిన రామాయణంలోని కొన్ని శ్లోకాలైనా చదువుతారు. అంతేగాకుండా.. ఆశ్వయుజ పౌర్ణమి అమ్మవారికి ప్రీతికరమైన తిథి. ఇది శరత్కాలంలో వచ్చే పూర్ణిమ. ఈ రోజు అమ్మవారని పూజించడం ఎంతో పుణ్యప్రదం. పాడ్యమి నుంచి దశమి వరకూ నవరాత్రులు జరిగాయి. అయితే పౌర్ణమి వరకూ అమ్మ వారి ఆరాధన వల్ల ఆమె అనుగ్రహం పొందవచ్చు. 
 
సంస్కృత భాషలో ఆదికవి అయిన మహర్షి వాల్మీకి జయంతి ఆశ్వీయుజ పౌర్ణమి రోజున వస్తుంది. వాల్మీకి గొప్ప మహర్షి. ఈయన రచించిన వాల్మీకి రామాయణాన్నే భారతీయులు ప్రామాణికంగా తీసుకుంటారు. రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది.
 
ఆ కథనం ప్రకారం వాల్మీకికి ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకర్. ఆయన తన కుటుంబాన్ని పోషించటానికి అడవిలో నివసిస్తూ బాటసారుల సొత్తును దోచుకుని బోయవాడిగా దొంగగా జీవితం గడిపేవారు. ఒకరోజు నారద మహర్షిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను నీకుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని నీ కుటుంబం కూడా పాలు పంచుకుంటుందా? అని ప్రశ్నిస్తారు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. తల్లిదండ్రులను భార్యను పిల్లలను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తారు.
 
ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని తెలుసుకుంటాడు. నారదుడు రామనామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తారు. ఉపదేశం తర్వాత ఆయన జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధి లోకి వెళ్ళిపోయారు చుట్టూ చీమలు  పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేశారు. 
 
చాలాకాలం తపస్సు చేశాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా వాల్మీకి అనే పేరుతో పిలుస్తాడు. వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యారు. తపో సంపదతో వాల్మీకి ఆశ్రమవాసం చేయసాగారు.
 
శ్రీ రాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీ రాముడు సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. 
 
యోగవాశిష్టము అనే యోగా, ధ్యానముల గురించిన సంపూర్ణ విషయములు గల మరో పుస్తకము మహర్షి వాల్మీకి వ్రాశారు. ఆదిత్య హృదయము అనెడి సూర్యస్తుతిని వ్రాసినవారు వాల్మీకి మహర్షియే. కౌసల్యా సుప్రజా రామ అనెడి సుప్రభాతమును వ్రాసిన వారు వాల్మీకియే. 
 
భారతీయ వాఙ్మయములో రామాయణము ఆదికావ్యముగాను, దానిని సంస్కృతములో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను సుప్రసిధ్ధము. ఈ రామాయణ కావ్యము ఎంతో ఆదరణీయము, పూజనీయము. అలాంటి కావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షిని ఆయన జయంతి రోజున స్తుతించుకుందాం.. సర్వ సంతోషాలను పొందుదాం..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు