#SashtiVirathamలో కనిపించే ఆంతర్యం ఏమిటి?

శుక్రవారం, 19 మార్చి 2021 (09:33 IST)
సర్వశక్తి స్వరూపుడైన కుమార స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహంజరిపించిన రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా పిలుచుకుంటున్నారు. ఈ రోజున వ్రతమాచరించే వారికి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో వెల్లివిరిస్తుంది. వివాహ దోషాలు తొలగిపోతాయి. అందుకే షష్ఠి రోజున "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.
 
ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతానం సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు.
 
ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.
 
ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజ దోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. ఈ రోజున నాగ ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తులలో ఉంది.
 
సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతంలో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విదానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది. శక్తి కొలది దానాలు చేయడం ద్వారా గ్రహ భాదలు తొలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని విశ్వాసం. అందుకే షష్ఠి అయిన ఈ రోజున కుమార స్వామిని పూజించి.. ఆయన అనుగ్రహం పొెందుదాం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు