కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకత ఉంది. బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని వివిధ రూపాల్లో, అవతారాల్లో దర్శనం చేసుకున్న వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు.. పుణ్యఫలాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి అలంకరణలో ఒదిగిపోవడానికి ప్రతి పువ్వు ఎంతగా ఆరాటపడుతుందో, ఆ అలంకరణతో చూపులను కట్టిపడేసే ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించాలని ప్రతి మనసు అంతగా తపిస్తుంది. అందుకే వార్షిక బ్రహ్మోత్సవమే అయినా ... నవరాత్రి బ్రహ్మోత్సవమైనా.. తిరుమల వెంకన్న క్షేత్రానికి భారీ స్థాయిలో భక్తులు తరలివస్తూనే వుంటారు.
శ్రీనివాసుడు ఇక్కడ ఆవిర్భవిస్తూ .. లోక కల్యాణం కోసం తనకి ఉత్సవాలు జరిపిస్తూ ఉండాలని బ్రహ్మదేవుడిని ఆదేశించాడట. దాంతో 'శ్రవణా నక్షత్రం'నాటికి పూర్తయ్యేలా తొమ్మిది రోజులపాటు దగ్గరుండి బ్రహ్మదేవుడు ఉత్సవాలను నిర్వహించడం వలన 'బ్రహ్మోత్సవాలు' అనే పేరు వచ్చిందని చెప్పబడుతోంది. 'అంకురార్పణ'తో మొదలయ్యే బ్రహ్మోత్సవాలు ... 'ధ్వజ అవరోహణ'తో ముగుస్తూ ఉంటాయి.
ఈ రోజుల్లో స్వామివారు ఉత్సవమూర్తిగా ... వివిధ రూపాల్లో ... వివిధ వాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటాడు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ఉదయం వేళలోను ... రాత్రి వేళలోను అమ్మవార్లతో కలిసి ఒక్కో వాహనంపై ఒక్కోరూపంలో దర్శనమివ్వడం వెనుక ఒక్కో సందేశం ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో స్వామివారు పెద్దశేష వాహనం, చిన్నశేషవాహనం, హంసవాహనం,సింహవాహనం, ముత్యపు పందిరివాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, పల్లకీ, గరుడవాహనం, హనుమ వాహనం, గజవాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ వాహనం, రథోత్సవం, అశ్వవాహనంపై స్వామి ఊరేగుతాడు.