ఆడ పిల్లల మనస్తత్వం మారిపోవడం ఎందుకో తెలుసా?

బుధవారం, 9 జనవరి 2013 (18:32 IST)
FILE
తల్లిదండ్రులంటే ఆడ పిల్లలకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. మగ పిల్లలకంటే.. ఆడపిల్లలే పెళ్లయి అత్తారింటికి వెళ్లినా తల్లిదండ్రులకు అండగా నిలుస్తున్నారు. అత్తగారింటి సమస్యలను అనుకూలంగా మలచుకుని పుట్టింటికి, తల్లిదండ్రులకు సాయం చేయడంలో ముందుంటున్నారు. కానీ ప్రస్తుత సామాజిక పరిస్థితుల కారణంగా ఆడ పిల్లల మనస్తత్వం మారిపోతోంది.

ఎందుకని ఆరాతీస్తే.. తల్లిదండ్రులు కష్టపడి చదివించడం కోసం నానా తంటాలు పడుతుంటే.. పాశ్చాత్య మోజు, చెడు స్నేహం, స్వేచ్ఛ ముసుగులో విచ్చలవిడిగా ఉండటానికి అలవాటు పడిపోతున్నారని సర్వేలో తెలుస్తోంది. ఇంకా ప్రేమ అనే పేరుతో తమ జీవితాన్ని మహిళలే అధికంగా నాశనం చేసుకుంటున్నారని సర్వే తేల్చింది.

ముఖ్యంగా ఆడపిల్ల మనస్తత్వం మారిపోయేందుకు కారణాలు ఏమిటని ఆరాతీస్తే.. తల్లిదండ్రులు ఘర్షణలకు దిగుతున్న ఆడపిల్లలు తమపై ప్రేమ చూపేందుకు వేరొకరిపై ఆధారపడుతున్నారట. తనను ప్రేమగా చూసుకునే వారి కోసం ఆరాటపడుతున్నారట. ఈ క్రమంలోనే బాయ్ ఫ్రెండ్‌ ఎంచుకుంటున్నారట. తనపై ప్రేమగా చూసుకునే వ్యక్తి వుంటాడా అనే అన్వేషణలో ప్రేమలో పడిపోతున్నారట.

అయితే పెంపకం పరంగా చూస్తే.. మునుపంతా పాఠశాల నుంచి ఇంటికొచ్చిన తర్వాత తల్లిదండ్రులతో ఆడపిల్లలు గడిపే సమయం ఎక్కువగా ఉండేది. ఇప్పుడంతా తల్లిదండ్రులకు ఓ గది, పిల్లలకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయడం ద్వారా ఆడపిల్లలు చిన్న వయస్సులోనే ఒంటరితనానికి అలవాటు పడిపోతున్నారు. ఒకవేళ తల్లిదండ్రులతో సమయం వెచ్చించినా అది టీవీలు చూడటానికే సరిపోతుందని సర్వే తేల్చింది.

ఈ కారణాలతో తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడే సమయం తగ్గిపోయిందని, అందుకే మహిళలు బయటి వ్యక్తులతో మాటా మంతీ సాగిస్తూ.. వారితో సంభాషణలు స్నేహంతో మొదలై ప్రేమతో ముగస్తుందని సర్వే తేల్చింది. అంతేకాదు.. ఈ స్నేహాలు కొన్ని సుఖాంతమైతే... మరికొన్ని విషాదాంతంగా మిగిలిపోతున్నాయి. అందుచేత ప్రస్తుత సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో అధిక శ్రద్ద తీసుకోవాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి