శ్రీ మల్లిఖార్జున స్వామికి ఆ పేరు ఎలా వచ్చింది?

మంగళవారం, 29 జనవరి 2019 (21:31 IST)
ద్వాదశజ్యోతిర్లింగాల్లో రెండవది శ్రీశైలం. పార్వతీ పరమేశ్వరుల కుమారులు వినాయక, కుమారస్వాములకు రుద్రగణాధిపత్యం కోసం జరిగిన పందెంలో ఆధిపత్యం వినాయకుడికి ఇవ్వబడింది. అందుకు కుమారస్వామి అలిగి తల్లిదండ్రులను వదిలి శ్రీశైలానికొచ్చి అక్కడ  క్రౌంచ పర్వతంపై కూర్చుని తనకాళ్లకు మంత్రబద్దంగా బంధనాలు వేసుకున్నాడు. 
 
పార్వతి అక్కడికెళ్లి తిరిగి రావలసిందిగా ఎంతగానో ప్రాధేయపడింది. కానీ కుమారస్వామి ఏమీ మాట్లాడక మౌనంగా ఉండిపోయాడు. అందుకు పార్వతీ తన కుమారుణ్ణి అక్కడ ఒంటరిగా వదలలేక శ్రీశైలం నందే శక్తిపీఠం నందు స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని భ్రమరాంబిక అన్నపేరుతో వెలసింది. పరమేశ్వరుడూ వారిని వదలలేక అక్కడే జ్యోతిర్లింగస్వరూపుడై వెలశాడు. 
 
ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని పాలించే రాజుకు లేకలేక ఒక కుమార్తె పుట్టింది. ఆమె పసిబిడ్డగా ఉన్నప్పుడే రాజు యుద్ధానికి వెళ్లిపోయాడు. ఆ యుద్ధం పదహారేండ్లు సాగింది. ఆ తర్వాత రాజు తన రాజ్యానికి తిరిగొచ్చాడు. అప్పుడు ఆ రాజుకు అతని కుమార్తె చంద్రవతి కనిపించింది. ఆమె ఎవరో అనుకొని రాజు ఆమె వెంటబడ్డాడు. అతని నుండి తప్పించుకొని కృష్ణానదిలో దూకింది. ఐనా తన వెంబడే వస్తున్న తన తండ్రిని బండరాయివైపో అంటూ శపించింది. వెంటనే రాజు పచ్చటి బండగా మారిపోయాడు. కాబట్టే అక్కడ నీరు ఎప్పుడూ పచ్చగానే ఉంటుందట.
 
అలా చంద్రావతి అక్కడున్న జ్యోతిర్లింగానికి నిత్యమూ మల్లెపూలతో పూజ చేసేది. అందుకు శివుడు ఎంతో సంతోషించి వరం కోరుకోమన్నాడు. అందుకు ఆమె స్వామీ.. ఆ మల్లెమాలను శాశ్వతంగా నీ కంఠంనందు అలంకరించుకో. అలాగే నీ జటాజూటంనందు ఒక మల్లెమాలను అలంకరించేందుకు నాకు అనుమతినివ్వు అని ప్రార్ధించింది. ఆ ప్రార్ధనను మన్నించి, ఆ మల్లెవూల సేవను అనుగ్రహించి, నీవు నాకలంకరించిన ఈ మల్లెమాల నా శిరస్సుపై ఎప్పటికీ వాడిపోకుండా విరాజిల్లుతూనే ఉంటుంది అని వరమిచ్చాడు. అలా ఆనాటి నుండి శ్రీశైలంలో మల్లికార్జునుడు అనే పేరుతో లోకప్రసిద్ధుడైనాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు