తిరుమల వెంకన్ననే కొట్టిన భక్తుడు.. అందుకే స్వామి ముఖంపై....!

గురువారం, 29 డిశెంబరు 2016 (16:01 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఒక వింత దొంగ. ఒక యామగాడు. ఎల్లప్పుడూ భక్తులతో పరాచికాలాడుతూ ఉంటాడు. మాయలు చేస్తూ ఉంటాడు. తాను ఆనందిస్తూ ఉంటాడు. మనల్ని ఆనందింపజేస్తూ ఉంటాడు. ఈ దొంగచేష్టలు ఈ మాయబుద్ధులు ఈనాటివా ఏమన్నానా..! ద్వాపరియుగంలో నాటివి కదా. ఆనాడు అమాయకులైన గొల్లల చేత నోరూరా తిట్టించుకున్నాడు గోవిందుడు.
 
తిట్టించుకోవడమే కాకుండా దెబ్బలు కూడా తిన్నాడు ఆ గోపాలుడు. మాయలు చేస్తూ అలా తిట్టించుకోవడం అంటే భలే ఇష్టం ఆ వెర్రి గోపాలునికి. దెబ్బలు తినడం అంటే కూడా భలే సరదా ఆ నల్లని కన్నయ్యకు. మరి ఆనాటి బుద్థుల్ని అలాగే పుణికి పుచ్చకున్నట్లు ఈ ఏడుకొండల మీద వెర్రి గోవిందుడు కూడా తక్కువ వాడా. ఈ కలియుగంలో కూడా ఒక పరమభక్తుని (తిరుమల నంబి) చేత నోరారా తిట్టించుకుని మరీ తృప్తిగా నీళ్లు తాగాడు మరి. అంతమాత్రమేనా. కాదు కాదు. మరో భక్తుని దగ్గరికి మారు రూపంతో వెళ్ళి వెట్టికి చాకిరీ చేశాడు.
 
కూలి డబ్బులు తీసుకోకుండా ఊరికే చాకిరీ చేశాడు. కూలి డబ్బులు లేకుండా ఊరికే చాకిరీ చేస్తే చేశాడు. కానీ అలా వెట్టికి పనిచేసినందుకు గాను ప్రతిఫలంగా మొహం వాచేట్లు బాగా దెబ్బలు కూడా తిని గాయం చేసుకున్నాడు తిరుమల వెంకన్న. తన సుందర వదనార విందంపై ఆనాడు ఆ భక్తుడు చేసిన గాయం తాలూకూ మచ్చను అందంగా పచ్చకర్పూరంతో తీర్చిదిద్దుకుని మమురిపెంగా నేటికీ ప్రదర్శిస్తూ తద్వారా సమ్మోహనం కలిగించే తన దివ్యదేహానికి మరింత నిగ్గులు పెట్టుకుంటూ తన భక్త ప్రియత్వాన్ని చాటుకూంటు ఉన్నాడు. 

వెబ్దునియా పై చదవండి