మాసశివరాత్రి రోజున సర్వేశ్వరుడిని పూజిస్తే.. ఫలితం ఏమిటి?

బుధవారం, 22 ఏప్రియల్ 2015 (18:57 IST)
పరమేశ్వరుడు, ముక్కంటి అయిన శివుడిని ప్రతీరోజూ పూజించడం ద్వారా కష్టనష్టాలను దూరం చేసుకోవచ్చు. దారిద్ర్యాలను తొలగించుకోవచ్చు. ఈతిబాధలను నశింపజేసుకోవచ్చు. అలాంటి మహిమాన్వితమైన దేవదేవుడిని ప్రతిరోజూ పూజించడానికి వీలులేకపోయినా.. మాసంలో వచ్చే మాసశివరాత్రి రోజున పూజించడం ద్వారా శుభఫలితాలను పొందవచ్చునని పండితులు అంటున్నారు. 
 
మాస శివరాత్రి రోజున పరమశివుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వలన మాసమంతా ఆయనని సేవించిన ఫలితం లభిస్తుంది. సదాశివుడికి ప్రదోష సమయం (సాయంకాలం) ప్రీతికరమైనది. మాసశివరాత్రి లేదా ప్రదోష సమయంలో ఆ సర్వేశ్వరుడికి సాయంకాల సమయంలో అభిషేకం జరిపి .. బిల్వదళాలతో అర్చించాలి.
 
పగటిపూట ఉపవాసం ... రాత్రి జాగారం ఈ రోజు నియమంగా కనిపిస్తుంది. పూజామందిరంలో స్వామిని పూజించినా ఆలయం దర్శనం చేయడం కూడా మంచిది. ఈ రోజంతా సదాశివుడిని మనసులో నిలుపుకుని ఆయన నామాన్ని స్మరిస్తూ ... ఆయన లీలావిశేషాలని కీర్తిస్తూ ... భజనల ద్వారా ఆయనకి మరింతగా చేరువయ్యే ప్రయత్నం చేస్తూ జాగరణ పూర్తిచేయవలసి వుంటుంది. ఈ విధంగా చేయడం వలన సమస్త పాపాలు నశించడమే కాకుండా దోషాలు తొలగిపోతాయి. పుణ్యఫలాలు ప్రాప్తించడం వలన సకలశుభాలు చేకూరతాయని పండితులు చెపుతున్నారు.  

వెబ్దునియా పై చదవండి