కార్తీక మాసమే కాదు.. ఏ మాసంలోనైనా శివకుటుంబం గల క్షేత్రాలను దర్శించుకునే వారికి సకల దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. శివుడు, పార్వతీదేవి, గణపతి, కుమారస్వామి ఒకేచోట కొలువుదీరిన క్షేత్రాలు అత్యంత విశిష్టమైనవిగా చెబుతుంటారు.
శివకుటుంబాన్ని దర్శించుకోవడం వలన సమస్త దోషాలు నశించి, సకల శుభాలు చేకూరతాయి. వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడు. కుమారస్వామి విజయాలను కలిగిస్తాడు. పార్వతీదేవి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శివుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ శివుడు, రాజరాజేశ్వరుడు పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. స్వామివారి గర్భాలయం పక్కనే గల ప్రత్యేక మందిరంలో అమ్మవారు కొలువై భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది.
ఇక వినాయకుడు, కుమారస్వామి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. ప్రాచీనకాలానికి చెందిన ఈ ఆలయం, అడుగడుగునా పవిత్రతను ఆవిష్కరిస్తూ వుంటుంది. ఆలయ వాతావరణాన్ని పరిశీలిస్తే, అష్టదిక్పాలకులతో కలిసి నందీశ్వరుడు ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తున్నట్టుగా కనిపిస్తాడు. ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన దోషాలు దూరమై తొలగిపోయి.. శుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు.