- అంటే భగవంతునికి నువ్వేది సమర్పించినా.. భక్తితో, హృదయశుద్ధితో సమర్పించు. అది పత్రమైనా, ఫలమైనా, జలమైనా సరే. అందుకే ''భక్తి రేవ గరీయసీ'' అన్నారు. భగవంతుడు కూడా భక్తి అంటే ''నమో భక్తిః ప్రణయ్యతి'' అని భరోసా ఇచ్చాడు.
భక్తి, హృదయశుద్ధి, మోక్షమార్గానికి టిక్కెట్టు వంటిది. కాబట్టి మోక్ష ప్రయాణానికి, భగవత్కృప, మోక్షప్రాప్తికి భక్తి, చిత్త నైర్మల్యం ముఖ్యం. భగవంతునకు విదురుడు ద్రౌపది పత్రమును, గజేంద్రుడు పుష్పమును, శబరి ఫలమును, రంతిదేవుడు జలమును భక్తితో సమర్పించుకుని కృతార్థులయ్యారు.
''భక్తి'' సమర్పణను కోరుతుంది. భక్తుడు ఉన్మత్తుడుగా ఉంటాడు. తన దైవానికి తప్ప, అతనికి ఇంకేది ఉండదు. ఆకలిదప్పిక ఉండదు. అహాన్ని వదిలి పరిపూర్ణ శరణాగతిని పొందడమే భక్తికి తొలిమెట్టు. అంత్యం ముక్తి. రథానికి ఉన్న రెండు చక్రాలవలె, పక్షికి ఉన్న రెండు రెక్కల వలె భక్తి, విశ్వాసం రెండూ కలిసి వుంటాయి.