తీర్థయాత్రలకు వృద్ధాప్యంలోనే వెళ్లాలా? వయసున్నప్పుడే వెళ్ళకూడదా?

సోమవారం, 11 జనవరి 2016 (16:06 IST)
తీర్థయాత్రలకు వృద్ధాప్యంలోనే వెళ్లాలని అందరూ అనుకుంటారు. బాధ్యతలన్నీ పూర్తిచేసిన తర్వాత తీర్థయాత్రలకు వెళ్తుంటారు అనేకమంది. అయితే తీర్థయాత్రలకు వయస్సుతో పనిలేదని.. భగవంతుడి నామస్మరణ చేయడానికి వయోపరిమితి సంబంధం లేదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. భగవంతుడి దర్శనం, ఆయన నామస్మర, పూజాభిషేకాలు అనంతమైన పుణ్యఫలితాలను ఇస్తాయి. 
 
అందుకే స్వామిని దర్శించుకునేందుకు వయస్సును అడ్డుపెట్టకూడదని, తీర్థయాత్రలకు వయస్సున్నప్పుడే వెళ్లడం ఉత్తమమని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఇలా చేస్తే.. సమస్త దోషాలు తొలగిపోయి.. కోరిన కోరికలు నెరవేరుతాయని.. సంతృప్తికర జీవితం లభిస్తుందని వారు సూచిస్తున్నారు. 
 
అయితే బాధ్యతలు తీరిన తర్వాత తీర్థయాత్రలకు వెళ్తే మాత్రం అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు తప్పవని, తద్వారా అనుకున్న క్షేత్రానికి వెళ్ళాలనే ఆలోచనను జాప్యం చేయకుండా పూర్తి చేసుకోవాలి. వృద్ధాప్యంలో తీర్థయాత్రలకు శరీరం సహకరించకపోవడం ద్వారా స్వామి దర్శనానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, అందుకే ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీర్థయాత్రలు చేయాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
 
వయస్సున్నప్పుడే తీర్థయాత్రల్లో భాగం కావడం ద్వారా వివాహం, సంతానానికి సంబంధించిన దోషాలు సైతం తొలగిపోతాయి. అందుకే వయస్సున్నప్పుడే పవిత్ర క్షేత్రాలు, యోగులు, మహర్షులు, మహాభక్తులు, సిద్ధులు నడయాడిన ప్రాంతాల్లో తీర్థయాత్రలు చేపట్టాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సుప్రసిద్ధ ఆలయాలకు వెళ్లడం ద్వారా దోషాలన్నీ తొలగిపోయి.. అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.

వెబ్దునియా పై చదవండి